స్వచ్ఛ ఏపీ సాధనలో విశ్వవిద్యాలయాలు భాగస్వాములు కావాలి: సీఎస్ దినేష్ కుమార్
వచ్చే మార్చి 2018 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు పూర్తిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
అమరావతి: వచ్చే మార్చి 2018 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు పూర్తిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ విజ్ణప్తి చేశారు.
స్వఛ్చ భారత్ మిషన్ లోభాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో విద్యార్ధులను భాగస్వాములను చేసే అంశంపై పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వచ్చే మార్చి 2018 నాటికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని దీనిలో అన్ని విశ్వ విద్యాలయాలు పూర్తిగా భాగస్వాములు కావాలని విజ్ణప్తి చేశారు.ఇందుకుగాను వెంటనే పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్యాశాఖ అధికారులు, విసిలు కలిసి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని చెప్పారు.
విశ్వ విద్యాలాయాల పరిధిలోని గ్రామాలన్నిటినీ ఇదొక సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమంగా చేపట్టి విద్యార్థులందరూ దీనిలో చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ విసిలకు సూచించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంపై అవగాహన కలిగించడం తద్వారా వ్యక్తిగత నడవడికలో మార్పు తీసుకువచ్చేందుకు విద్యార్ధులు కృషి చేయాల్సి ఉందని చెప్పారు.
అదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రతలపై ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు తీసుకు వచ్చేందుకు కృషి చేయాల్సి ఉందని ఆదిశగా విద్యార్ధులను సన్నద్ధం చేసి గ్రామాలకు పంపాలని సిఎస్ సూచించారు. కేవలం వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణంపైనే కాకుండా వాటిని ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలనే పూర్తి అవగాహన కలిగించేందుకు కృషి చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనే విధ్యార్ధులకు విశ్వ విద్యాలయాలు ప్రత్యేకంగా 5శాతం వెయిటేజి మార్కులు ఇవ్వనున్నందున ఇందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కార్యక్రమంగా దీనిని చేపట్టినందున విసిలందరూ పూర్తిగా భాగస్వాములు కావాలని సిఎస్ దినేష్ కుమార్ సూచించారు.
గ్రామాల్లో వ్యక్తిగత మరగుదొడ్లు నిర్మించడంతోపాటు వాటిని సక్రమంగా వినియోగించే విధంగా ప్రజల్లో అవగాహన పెపొందించుటలో విద్యార్ధులతోపాటు డ్వాక్రా సంఘాలను కూడా పూర్తిగా భాగస్వాములను చేయాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాక ముఖ్య కార్యదర్శిని సిఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు.
విశ్వ విద్యాలయాల పరిధిలో గ్రామాల్లో విద్యార్ధులతో నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్,వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం,వినియోగంపై జరిగే అవగాహనా కార్యక్రమాలను విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేసేందుకు జిల్లాకొక నోడలు అధికారిని నియమించే విధంగా జిల్లా కలక్టర్లకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయనున్నట్టు సిఎస్ తెలిపారు.
ఈసమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్,స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంశానికి సంబంధించి విశ్వ విద్యాలయాలతో కలిసి ఒక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వర్యుల ఆదేశించారని గుర్తు చేశారు.కావున ఇదొక సామాజిక కార్యక్రమంగా భావించి విశ్వవిద్యాలయాలు విద్యార్ధులను పూర్తిగా భాగస్వాములను చేయాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రమిషన్ కార్పొరేషన్ ఎండి మురళీధర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక వెబ్ సైట్ ను రూపొందించామని దానిని విశ్వ విద్యాలాయాలు,విద్యార్ధులు వినియోగించు కోవచ్చని ఆవివరాలు అందరికీ ఇస్తామని తెలిపారు.
వివిధ విశ్వ విద్యాలయాల ఉప కులపతులు మాట్లాడుతూ వారి విశ్వ విద్యాలయం పరిధిలోని వివిధ కళాశాల విద్యార్ధులను, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లను ఇప్పటికే ఈకార్యక్రమంపై చైతన్యవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈనెలలో వివిధ పరీక్షలు అనంతరం రానున్న నాలుగు మాసాల్లో విద్యార్ధులను ఈకార్యక్రమంలో పూర్తిగా భాగస్వాములను చేయడం జరుగుతుందని విసిలు పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లకు పూర్తిగా అవగాహన కలిగించామన్నారు. ఈసమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్,వివిధ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు తదితరులు పాల్గొన్నారు.