జోరుగా యోగాంధ్ర..!!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తోంది. ప్రపంచ దేశాలు జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా జరుపుకోనున్నాయి. భారత్ లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో యోగా కార్యక్రమంలో పాల్గొనున్నారు.
జూన్ 21వ తేదీన అయిదు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఆ రోజున ఉదయం 7 నుంచి 8 గంటలకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. విశాఖపట్నం ఆర్ కే బీచ్ దీనికి వేదిక. అదే రోజున దాదాపుగా 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ అందజేసేలా చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఈ నెల 21వ తేదీ దీనికి శ్రీకారం చుట్టింది. జూన్ 21వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనికింద- రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాల్లో స్థానిక అధికార యంత్రాంగం యోగా శిబిరాలు, శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది.
ఈ నెల రోజుల యోగా కార్యక్రమాల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా రెండుకోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది ఏపీ ప్రభుత్వం. 2,500 మందిని యోగా మాస్టర్ ట్రైనర్స్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. యోగాపై సమగ్ర అవగాహన, శిక్షణ ఇవ్వనుందీ కార్యక్రమాల ద్వారా. యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం ఇవి కొనసాగుతాయి.
ఈ నేపథ్యంలో- విజయవాడలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ నగర పోలీసులు దీన్ని ఏర్పాటు చేశారు. బీఆర్టీఎస్ రోడ్.. దీనికి వేదిక అయింది. 5,000 మందికి పైగా వివిధరంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో భాగస్వామ్యులయ్యారు. వివిధ కళాశాలల విద్యార్థులు, ధ్యాన/యోగా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టీ కృష్ణబాబుతో పాటు వివిధ మంత్రిత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, విజయవాడ నగర పోలీస్ కమిషన్ రాజశేఖర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు యోగాంధ్రలో పాల్గొన్నారు. ఆసనాలు వేశారు.












Click it and Unblock the Notifications