గుంటూరులో రేపు పూర్తిగా కర్ఫ్యూ..మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా..
ఏపీలో కరోనా వైరస్ పాటిజివ్ కేసుల సంఖ్యలో కర్నూలు తర్వాత రెండో స్ధానంలో ఉన్న గుంటూరు జిల్లాలో రేపటి నుంచి మరింత కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇకపై ఇళ్లలో నుంచి బయటికి వస్తే ఇక అంతే సంగతులు అన్నంత సీరియస్ గా ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయని అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి పూర్తిగా కర్ఫ్యూ అమల్లోకి రానుంది.

భయపెడుతున్న గుంటూరు కేసులు..
ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసుల పైనా వాటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చి తొలి కరోనా బాధితుడిగా తేలిన వ్యక్తి చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. అతని నుంచి సోకిన వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ పోవడం అధికారులను కలవరపెడుతోంది. ఇవాళ సాయంత్రం విడుదలైన హెల్త్ బులిటెన్ గణాంకాల ప్రకారం గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75కు చేరుకుంది.

రేపటి నుంచి మరిన్ని ఆంక్షలు..
వాస్తవానికి ఇప్పటివరకూ లాక్ డౌన్ నిబంధనలతో పాటు 144 సెక్షన్ అమలవుతున్నా.. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంపై అధికారులతో పాటు సాధారణ జనంలోనూ అలజడి రేగుతోంది. దీంతో కఠిన చర్యలు చేపడితేనే కానీ పరిస్ధితి అదుపులోకి రాదని భావిస్తున్న అధికారులు రేపటి నుంచి పూర్తిస్ధాయిలో కర్ఫ్యూ అమలుకు సిద్ధమయ్యారు. ప్రజలు రోడ్లపైకి రావొద్దని జిల్లాలోని అన్ని చోట్ల హెచ్చరికలు చేస్తున్నారు.

మాస్క్ లేకపోతే వెయ్యి జరిమానా- ఆంక్షలు..
గుంటూరు జిల్లా వ్యాప్తంగా 12 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన అధికారులు... జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ మాస్కులు లేకుండా తిరగడాన్ని నిషేధించారు. రోడ్లపైకి మాస్కు లేకుండా వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే నిత్యావసరాల కొనుగోళ్లకు అనుమతిస్తామన్నారు. మెడికల్ షాపులు తప్ప ఇతర షాపులేవీ తెరిచి ఉండబోవని కలెక్టర్ తెలిపారు. హోం డెలివరీ సదుపాయాన్ని వాడుకోవాలని ప్రజలకు సూచించారు.












Click it and Unblock the Notifications