హుధుద్ తుఫాను: అచ్చెన్నాయుడు హెచ్చరిక
హైదరాబాద్: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన హుధుద్ పెను తుపాన్గా మారింది. శనివారం నుంచి ఆంధ్రప్రదేశ్పై తుపాన్ ప్రభావం కనిపించనుంది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలో హుధుద్ కేంద్రీకృతమైంది.
క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా పయనించే అవకాశం ఉన్నట్లు విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో హుధుద్ తీవ్ర తుపాన్గా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 12న విశాఖ, గోపాల్పూర్ల మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది.
తుపాన్ ప్రభావంతో 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు.
తుపాన్ విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ 51 బృందాలను సిద్ధం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశిచారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అలాగే తుపాన్ ప్రభావిత జిల్లాల్లో ప్రజలు నిత్యావసర సరుకులు, తాగునీటికి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
హుధుద్ తుఫాను నేపథ్యంలో మంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు తదితరులు సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంతంలో 165 బోట్లు, 52 మంది గజ ఈతగాళ్లను ఉంచినట్లు తెలిపారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. హుధుద్ తుఫాను తర్వాత అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు ఉంటాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.