మొంథా తుఫాను బీభత్సం.. రైతులకు ప్రభుత్వం కీలక హామీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన మొంథా తుఫాను విరుచుకుపడుతోంది. ప్రస్తుతం తుఫాను తీరానికి దగ్గరగా వస్తోందని.. కోస్తాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ప్రారంభమైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితిని సమీక్షిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచిస్తున్నారు.
మొంథా తుఫానుపై అధికారులను అలెర్ట్ చేస్తున్న చంద్రబాబు
గతంలో వచ్చిన తుఫానుల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని చంద్రబాబు ఆదేశించారు. గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్టుగా జాగ్రత్త వహించాలని చంద్రబాబు సూచనలు చేశారు.

రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చిన మంత్రి
ఇదే క్రమంలో ఏపీలో తుఫాను తీవ్రత అధికంగా ఉండబోతున్న నేపథ్యంలో, తుఫాను ప్రభావిత జిల్లాలలో రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం చెబుతోంది. తుఫాన్ కారణంగా రైతులు పంట నష్టపోతే, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను, అధికారులను, కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
పత్తి కొనుగోలుకు కీలక ఆదేశాలు
చంద్రబాబు నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను, ముందస్తు ప్రణాళికతో పక్కాగా అధిగమించగలిగామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మొంథా తుఫాను వేళ పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ప్రస్తుతం మొంథా తుఫాను తీవ్రత నేపథ్యంలో, రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని, ఉద్దేశించిన తేదీ సమయం ప్రకారం పత్తి విక్రయాలు జరపాలని ఆయన సూచించారు.
రైతులకు ప్రభుత్వ సాయం
2025- 26 సంవత్సరానికి 4.5 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేసినట్టు, సుమారు ఎనిమిది లక్షలు పెట్టి టన్నుల పత్తి దిగుబడి ఏపీలో అంచనా వేసినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.తుఫాను ప్రభావిత ప్రాంతాల రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications