కెసిఆర్కు అంత సీన్ లేదు, 25 సీట్లే: దామోదర
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికారంలోకి వచ్చే సీన్ లేదని, ఎన్నికల్లో ఆ పార్టీకి 25 సీట్లకు మించి రావని మాజీ ఉపముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార సారథి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం నాడు మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని నేరడిగుంటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
తెలంగాణలోని 40 సీట్లలో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, వారెలాగూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓట్లేయరని, మిగిలిన 79 స్థానాల్లో కేడర్ను, లీడర్లను కాదని కెసిఆర్ సీట్లు అమ్ముకున్నారని అన్నారు. తెరాసకు 25కు మించి సీట్లు రావని దామోదర విశ్లేషించారు. ఇన్ని అవాంతరాలున్నా తన పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు.
కెసిఆర్ కుటుంబ పాలనకే మొగ్గుచూపుతున్నారని, తెలంగాణ అభివృద్ధిపై కెసిఆర్ మక్కువ లేదన్నారు. ఉద్యమం పేరిట దోచుకోవడం తప్ప తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నించారు. కొడుకు, కూతురు, అల్లుడు ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో జిల్లాను పంచి, దోచుకోమని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్లాంటి మోసగాడికి అధికారమివ్వవద్దని, కెసిఆర్ను నమ్మొద్దని ప్రజలకు ఆయన హితవు పలికారు.
కడుపు చించుకుని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఆమె రుణం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుడతామని చెప్పారు.
కాప్రా డివిజన్ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కూడా దామోదర మాట్లాడారు. సగం కడుపు కోసుకుని సోనియాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాలేదని, ఒక్క ఎంపీతో ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దగా, మోసం, నయవంచనకు పర్యాయ పదం కెసిఆర్ అని, ఇలాంటి వ్యక్తికి అధికారం అప్పగిస్తే అభివృద్ధి అసాధ్యమని ధ్వజమెత్తారు.