మూడు రాజధానుల ఉపసంహరణ నిజమేనా? జగన్ ను నమ్మలేం .. రాజధాని గ్రామాల్లో చర్చ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం మూడు రాజధానుల ఉపసంహరణ ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం నిజమేనా? ఇంత కాలంగా రాజధాని రైతులు పోరాటం చేస్తుంటే పట్టించుకోని జగన్ ఉన్నపళంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి? మొదటి నుంచి మూడు రాజధానులు విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న జగన్ ఇప్పుడు అమరావతి నే రాజధానిగా కొనసాగిస్తారా? జగన్ నిర్ణయాన్ని నమ్మొచ్చా? అంటూ ఏపీ లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి గ్రామాలలో, గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.

రాజధాని అమరావతి కోసం రైతులు గత రెండేళ్లుగా పోరాటం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 2019 డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఏపీకి మూడు రాజధానులుగా విశాఖ, కర్నూలు, అమరావతి లు కొనసాగుతాయని వెల్లడించారు. పరిపాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధాని కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటన రాజధాని గ్రామాల ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. రాజధానిగా అమరావతి కొనసాగాలని తమ భూములను త్యాగం చేస్తే, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ వెల్లడించడం రుచించని అమరావతి ప్రాంత రైతులు అమరావతి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జగన్ నిర్ణయం మార్చుకోవాలని ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని నాటి నుంచి నేటి వరకు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

రాజధాని రైతుల గోడు వినని జగన్ సర్కార్
ఇక మూడు రాజధానులు ఏర్పాటు కోసం అసెంబ్లీలో బిల్లులను ఆమోదించడం, ఆ బిల్లులు గవర్నర్ ఆమోదం కూడా పొందటం తెలిసిందే. ఇదే సమయంలో సిఆర్డిఏ ను కూడా రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు పై కోపంతో జగన్ తీసుకున్న నిర్ణయం అని భావించిన రాజధాని ప్రాంత రైతులు అనేకమార్లు సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని ప్రాంత రైతుల గోడు విన్న దాఖలాలు లేవు.

కోర్టులకు వెళ్ళినా సరే వెనక్కు తగ్గని జగన్ .. మూడు రాజధానుల వైపే మొగ్గు
మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని వడివడిగా అడుగులు వేశారు. రైతులు కోర్టుకెక్కినా సరే తన నిర్ణయాన్ని మార్చుకుని లేదని తేల్చి చెప్పారు. విశాఖ కేంద్రంగా పాలన సాగించాలని శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ఇక మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని రాజధాని రైతుల పోరాటం, పెయిడ్ ఆర్టిస్టుల పోరాటమని, కేవలం తెలుగుదేశం పార్టీ బినామీల కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని పదేపదే విమర్శించింది వైసిపి. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కక్ష తో జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదని రాజధాని ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.

జగన్ దెబ్బకు రాజధాని ప్రాంతంలో కుప్పకూలిన భూముల ధరలు, అయోమయంలో ప్రజలు
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా పాతాళానికి చేరిపోయాయి. రాజధాని నగరంలో కట్టిన బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్ల ధర పతనానికి చేరుకుంది. రాజధాని నగరంగా ఉన్న అమరావతి ప్రాంతం ఒక్కసారిగా వెలవెలబోయింది. అక్కడ వ్యాపారాలు ఒక్కసారిగా కుప్ప కూలాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 3 రాజధానుల నిర్ణయం దెబ్బకు ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జగన్ నిర్ణయాన్ని మార్చుకుంటారు అన్న భావన ఏమాత్రం ప్రజలకు లేకుండా పోయింది.

ఉద్యమానికి స్పందించని జగన్ సడన్ గా కీలక నిర్ణయం ... ఇది నిజమేనా ? చర్చ
సడన్ గా హైకోర్టులో రాజధాని కేసుల విచారణ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ఉపసంహరణ నిర్ణయం తీసుకోవడం ప్రజలను ఆలోచించేలా చేస్తోంది. ఇది నిజమేనా అని వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఇంత కాలం ఎంత పోరాటం చేసినా స్పందించని జగన్, ఉన్నపళంగా మళ్ళీ మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం తీసుకోవటం వెనక మతలబు ఏమైనా ఉందా అన్న చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిగా అమరావతిని జగన్ అంగీకరించడన్న చర్చ ఏపీలో జరుగుతుంది. కేవలం టీడీపీపై కక్షతో, చంద్రబాబు నిర్మాణం చేశాడన్న కారణంతో అమరావతిని జగన్ ఇష్టపడరని, అలాంటి జగన్ ఇప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని అంగీకరిస్తారా ? అన్నది ప్రజలలో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

షాక్ లో రాజధాని అమరావతి రైతులు ...జగన్ నిర్ణయంపై అనుమానం, అందరిలో టెన్షన్
రాజధాని అమరావతి పట్ల సానుకూలంగా స్పందించే వాడైతే జగన్ ఎప్పుడో స్పందించే వాడిని, ఇంత కాలం తర్వాత తీసుకున్న ఈ నిర్ణయంలో ఏదో మెలిక ఉందని రాజధాని గ్రామాలలో ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే బాగుండు అని భావిస్తున్నారు. ఒకవేళ ఇది కేవలం కోర్టు కేసుల నేపధ్యంలో తీసుకున్న నిర్ణయం అయితే తర్వాత జగన్ ఏం చేయబోతున్నారు అన్న అనుమానంతో ఉన్నారు. అసలు ఊహించని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన షాక్ తో రాజధాని ప్రాంత ప్రజలు కోలుకోలేక పోతున్నారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోలేక సతమతమవుతున్నారు. జగన్ ను నమ్మలేమని పలువురు రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే వెల్లడించిన నేపధ్యంలో ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications