పక్కా మైలేజ్ గేమ్-అందులో రఘురామ సక్సెస్-జగన్, సాయిరెడ్డిపై పిటిషన్ల వెనుక ?
ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే రెండేళ్లుగా పోరాటం చేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తాజాగా మరో రెండు ఎదురుదెబ్బలు తలిగాయి. తన పార్టీ అధినేత వైఎస్ జగన్,. తోటి ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో సీబీఐ కోర్టు మంజూరు చేసిన బెయిల్స్ రద్దు చేయాలని పిటిషన్లు వేసిన రఘురామకు నిన్న చుక్కెదురైంది. అయినా ఆయన మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. తాను కోరుకుందే జరిగినట్లు ఎంచక్కా హైకోర్టు దీనిపై మరో పిటిషన్ వేస్తా, అక్కడా కాదంటే సుప్రీంకోర్టుకు వెళ్తానని ధీమాగా చెప్తున్నారు. దీని వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
వైసీపీ వర్సెస్ రఘురామ
వైసీపీ తరఫునే ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఎక్కడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను బయటపడనీయకుండా సొంత పార్టీపై పోరాటం చేస్తున్న రఘురామకృష్ణంరాజు... వేసే ప్రతీ అడుగులోనూ జాగ్రక్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం జగన్, విజయసాయిరెడ్డిని వీలైనన్ని ఎక్కువసార్లు న్యాయస్ధానాల్లో దోషులుగా నిలబెట్టడమే లక్ష్యంగా రఘురామ పావులు కదుపుతున్నారు. తాజాగా మూడు నెలల క్రితం సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన రఘురామ, ఆ తర్వాత విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేశారు. అంతటితో ఆగకుండా జగన్ బెయిల్ రద్దు కాలేదంటూ బ్రేకింగ్ న్యూస్ వేసిన జగన్ ఛానల్ సాక్షినీ కోర్టుకు ఈడ్చారు. ఇప్పుడా వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది.
రఘురామకు ఎదురుదెబ్బలు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈ మధ్య వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో సానుకూల తీర్పు వస్తుందని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. దీన్ని ముందే ఊహించి హైకోర్టులో ఈ పిటిషన్లను వేరే బెంచ్ కు మార్చాలని, అప్పటి వరకూ తీర్పు ఇవ్వకుండా ఆపాలని కోరినా అక్కడా ఆశాభంగమే ఎదురైంది. దీంతో జగన్, విజయసాయిరెడ్డిపై గత మూడు నెలలుగా ఆయన చేస్తున్న పోరాటానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది.
ఇప్పుడు ఆయన తిరిగి సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. అక్కడా కుదరకపోతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తానని చెప్తున్నారు.
వైసీపీతో పోరు సశేషం
వైసీపీ అధినేత, సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్స్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసినా, తిరిగి దానిపై హైకోర్టుకు వెళ్లేందుకు రఘురామకృష్ణంరాజు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో రఘురామ దాఖలు చేయబోయే పిటిషన్ కూడా ఆసక్తి రేపుతోంది. ఇందులోనూ జగన్, విజయసాయిరెడ్డిపై వేర్వేరుగా పిటిషన్లు వేస్తారా లేక కలిపి వేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. హైకోర్టులో దాఖలు చేసే పిటిషన్ పై వచ్చే తీర్పు, ఆ తర్వాతి పరిణామాల్ని సైతం ఊహించి రఘురామ జనంలో చర్చ కొనసాగేలా చేస్తున్నారు.
రఘురామ సీబీఐ లాజిక్ మిస్సవుతున్నారా ?
జగన్, విజయసాయిరెడ్డిపై దాఖలు చేసిన పిటిషన్లలో రఘురామ ప్రస్తావించిన కారణాలు దాదాపు అవే ఉన్నాయి. అధికారం చేతిలో ఉంది కాబట్టి తమ బెయిల్ నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ దాన్ని వాడుకుంటూ కేసును ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ బెయిల్ లో ఇచ్చిన నిబంధనలు, షరతులకు వ్యతిరేకంగా వీరిద్దరూ ఏం చేశారనేది తేల్చాల్సింది దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐ. కానీ ఇక్కడ రఘురామ వేసిన పిటిషన్లపై చికాకుపడుతున్న సీబీఐ న్యాయవాదులు.. అంతిమంగా తాము జోక్యం చేసుకోబోమని, కోర్టే నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పేశారు. అక్కడితోనే ఈ కేసు బలహీనపడినట్లయింది. కానీ రఘురామ మాత్రం విజయసాయిరెడ్డి విదేశాలు వెళ్లేందుకు సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతిని అనుమానంగా మార్చి హైకోర్టులో పిటిషన్ వేసి ఎదురుదెబ్బ తిన్నారు. దీంతో రఘురామ సీబీఐ లాజిక్ ఎందుకు మిస్సవుతున్నారన్న చర్చ జరుగుతోంది.
రఘురామ టార్గెట్ రీచ్ అయ్యారా ?
అయితే మరోవైపు రఘురామరాజు కోరుకున్నవిధంగా తన లక్ష్యాన్ని సాధించారనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే రఘురామరాజు ఎప్పుడైతే జగన్, సాయిరెడ్డికి బెయిల్స్ కు వ్యతిరేకంగా సీబీఐ కోర్టులో పిటిషన్లు వేశారో అప్పుడే సీబీఐ ఈ పిటిషన్లలో జోక్యం చేసుకునేందుకు, తమ వాదనలు వినిపించేందుకు నిరాకరించింది. అప్పుడే రఘురామకృష్ణంరాజు ఈ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు వీలుంది. కానీ ఆయన అలా చేయలేదు. దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐ మద్దతు లేకుండా ఈ పిటిషన్లపై తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని రఘురామ భావించి ఉండకపోవచ్చు. కానీ ఆయన సిబీఐ మద్దతు లేదనీ తెలిసీ ఈ పిటిషన్లపై చివరి వరకూ వెళ్లారు. చివరి నిమిషంలో మాత్రం సీబీఐ కోర్టుపై నమ్మకం లేదంటూ హైకోర్టులో పిటిషన్ వేసి మరో సంచలనం కోసం ప్రయత్నించారు. చివరికి అక్కడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఇప్పుడు రఘురామ సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్తున్నారు. అక్కడా చుక్కెదురైతే సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్నారు. దీంతో అసలు రఘురామ తన టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది.
Recommended Video
రఘురామకు ముందే తెలుసా ?
రఘురామరాజు సీఎం జగన్, విజయసాయిరెడ్డిపై వేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు తోసిపుచ్చడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. ఇందులో రఘురామ చేసిన ఆరోపణలకు తగిన బలమైన కారణాలు సమర్పించలేకపోవడం ఒకటైతే ప్రతివాదులైన జగన్, సాయిరెడ్డి ఆయనపై చేసిన రాజకీయ కారణాల ఆరోపణ. పిటిషనర్ అయిన రఘురామరాజు గత రెండేళ్లుగా జగన్ తో పాటు వైసీపీపై చేస్తున్న పోరాటంతో పాటు జగన్, సాయిరెడ్డి తన వాదనల్లో ప్రస్తావించిన రాజకీయమే ఈ పిటిషన్లను డిస్మిస్ అయ్యేలా చేసిందని న్యాయవాదులు చెప్తున్నారు. ఈ పిటిషన్లు డిస్మిస్ అవుతాయని రఘురామకు ముందే తెలుసని, కానీ ఆయన మాత్రం రాజకీయంగా మైలేజ్ కోసమే వీటిని కొనసాగించారనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పడం వెనుక కూడా ఇదే కారణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సాధ్యమైనంత ఎక్కువగా పొలిటికల్ మైలేజ్ అందుకోవాలన్న తాపత్రయమే ఆయనలో కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.