ఏపీలో మరింత తగ్గిన కరోనా- 13 వేల కేసులు- పశ్చిమలో మరణ మృదంగం
ఏపీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు క్రమంగా నెమ్మదిస్తున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వం, అటు ప్రజలకూ ఊరట లభిస్తోంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా ఉంటోంది. గత 24 గంటల్లో 14756 కొత్త కేసులు నమోదు కాగా.. 104 మంది కరోనాతో చనిపోయారు.
గత 24 గంటల్లో ఏపీలో నమోదైన కొత్త కరోనా కేసుల్లో మరోసారి తూర్పుగోదావరి జిల్లా 2301 కేసులతో టాప్లో నిలిచింది. ఆ తర్వాత స్ధానాల్లో చిత్తూరు 2155 కేసులతో ద్వితీయ స్ధానంలో నిలిచింది. ఈ రెండు జిల్లాల్లోనే రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 1397, అనంతపురంలో 1224, విశాఖలో 1004 కేసులు వచ్చాయి. నెల్లూరు 865, ప్రకాశం 811, కృష్ణా 782, గుంటూరు 780, కర్నూలు 742, శ్రీకాకుళం 666, విజయనగరం 397 కేసులతో వెయ్యికి లోపు కేసులున్న జిల్లాలుగా నిలిచాయి.
వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 16.68 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14.84 లక్షల మంది కోలుకున్నారు. మరో 1.73 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
మరణాల విషయానికొస్తే పశ్చిమగోదావరి జిల్లాలో మరణమృదంగం మోగుతోంది. గత 24 గంటల్లో కేవలం ఈ ఒక్క జిల్లాలోనే 20 మంది చనిపోయారు. ఆ తర్వాత స్ధానాల్లో చిత్తూరు 13, విశాఖ 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 9, గుంటూరు 8, కృష్ణాలో 8, కర్నూల్లో 7, నెల్లూరులో 6, విజయనగరంలో 6, శ్రీకాకుళంలో 5, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు చనిపోయారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 10738 మంది చనిపోయినట్లయింది. గత 24 గంటల్లో 79564 శాంపిల్స్ పరీక్షించారు. 20392 మంది కరోనా నుంచి కోలుకున్నారు.