3దశలు కాదు, 2వ్యూహాలు: సభ తర్వాత పవన్ ఆమరణ దీక్ష లేదా పాదయాత్ర?
కాకినాడ: ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం దాదాపు తేల్చి చెప్పింది. గతంలో కంటే మరింత స్పష్టతను ఇచ్చింది. కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ తదితరులు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనే చర్చ సాగుతోంది.
గత తిరుపతి సభలో ఆయన సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని మూడు దశల్లో తీసుకు వెళ్తామన్నారు. మూడో దశ ఆమరణ నిరాహార దీక్ష. అదే సమయంలో, హోదా పైన కేంద్రం స్పష్టత ఇచ్చిన తర్వాతనే మాట్లాడుతానని పవన్ చెప్పారు. అప్పటి దాకా ఉద్యమమేనని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఒకటి హోదా పైన కేంద్రం దాదాపు స్పష్టత ఇచ్చింది. హోదా ఇవ్వమని, దానికి సమానమైన ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనే చర్చ సాగుతోంది.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతారా? హోదా ఇవ్వలేమని తేల్చినందున మూడు దశల్లో ఉద్యమాన్ని పక్కన పెట్టి, ఇప్పుడే నిరసన దీక్షకు దిగుతారా? మొదట చెప్పినట్లుగా మూడు దశల్లో ఉద్యమిస్తారా? అనే చర్చ సాగుతోంది.
గంటపాటు ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్
కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రసంగిస్తారు. సభ ముగియగానే పవన్ ఆమరణ దీక్షకు కూర్చోనున్నారని తెలుస్తోందని అంటున్నారు. కేంద్రం ఇచ్చిన హామీలు రెండున్నర సంవత్సరం గడిచినా అమలు చేయకపోవడంపై పవన్ దీక్ష చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రత్యేక హోదా, ఏపీ నష్టపోయిన వాటన్నింటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ తర్వాత ఏపీ ఎంపీల మీద ఒత్తిడి తెచ్చాక కేంద్రం దిగివచ్చేలా మూడు దశల్లో కార్యాచరణను పవన్ ఇది వరకే తిరుపతి బహిరంగ సభలో ప్రకటించారు.
ఏపీకి ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక తిరుపతి సభలో చెప్పినట్లుగా మూడు దశల్లో పోరాటం అక్కర్లేదని, నేరుగా కేంద్రంతో పోరాటానికి దిగాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
అయితే ఇదే కాకినాడ సభ ముగిసిన తర్వాత సభా వేదిక పైనే దీక్ష ప్రారంభించాలని పవన్ కృత నిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోందంటున్నారు. పవన్ రెండు నిర్ణయాలు తీసుకున్నారని, ఒకటి సభ అయిపోయిన తర్వాత దీక్ష చేయడం లేదా రెండు ఢిల్లీ వరకు పాదయాత్ర చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవి రెండూ లేకపోతే దీక్ష లేదా పాదయాత్ర ఎప్పుడన్న విషయం ప్రకటించవచ్చునంటున్నారు.












Click it and Unblock the Notifications