ప్రకాష్ రాజ్ కు టీటీడీ బోర్డు సభ్యుడి నోటీసులు
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆయనకు పరువు నష్టం నోటీసు జారీ చేశారు. ప్రకాష్ రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఈ నోటీసును పంపారు. ఇందులో పలు డిమాండ్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వారం రోజుల్లో ప్రకాష్ రాజ్ నెరవేర్చాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కేరళలో ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ సీతారామలక్ష్మణులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు రామాయణాన్ని వక్రీకరించాయని, కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మతపరంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించారు. హిందువుల ధర్మగ్రంధం రామాయణంతో పాటు అశేష హిందువులను కించపరిచాయని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఉత్తరాదికి చెందిన శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు దక్షిణాది ప్రాంతానికి చెందిన లంకపై దండయాత్ర చేసినట్లుగా రామాయణాన్ని వక్రీకరించారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఇది ఇతిహాసాన్ని తీవ్రంగా వక్రీకరించడమేనని పేర్కొన్నారు. దక్షిణాదిని లంకగా, ఉత్తరాదిని దురాక్రమణదారులుగా వర్గీకరించడం ద్వారా ప్రాంతీయ వైరాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, జాతీయ సమైక్యతకు ముప్పు కలిగించే ఆర్యన్-ద్రావిడ విభజనను ప్రోత్సహించినట్టయిందని అన్నారు.
దీని ద్వారా హిందూ మత విశ్వాసాలను అపహాస్యం చేశారని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించి, విద్వేషాన్ని సృష్టించడానికి ఉద్దేశించిన వాస్తవ విరుద్ధమైన ప్రకటన అని చెప్పారు. సామాజిక అశాంతిని సృష్టించేవిగా నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఏడు రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని భానుప్ ప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజ్ ను డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాతో సహా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కూడా సూచించారు.












Click it and Unblock the Notifications