ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా రద్దు: విజయవాడలో లాక్డౌన్ లేదు, తూ.గో.లోనే..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు.. గ్రేడింగ్, మార్కులపై..
అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్టార్లు, ఇతర ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. అలాగే, డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్ లేదా మార్కులపై నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక విశ్వవిద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఏపీలో 8 మరణాలు.. కొత్తగా 462 కేసులు
ఇది ఇలావుండగా, ఏపీలో గడిచిన 24 గంటల్లో 462 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9834కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8 మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 119కి చేరింది.

విజయవాడలో పూర్తి స్థాయి లాక్డౌన్ లేదు.. ఉత్తర్వులు వెనక్కి..
కాగా, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విజయవాడలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. జూన్ 26 నుంచి వారం రోజులపాటు విజయవాడలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇప్పుడున్న పరిస్థితులే ఉంటాయని కలెక్టర్ చెప్పారు.
Recommended Video

తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ లాక్డౌన్..
మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 25 నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలు వ్యాపారులకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకుల కార్యకలాపాలు యథాతథమేనని అన్నారు. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. మాస్కులు ధరించకుండా బయటికి వస్తే రూ. 100 జరిమానా విధిస్తామన్నారు.












Click it and Unblock the Notifications