ఆత్మరక్షణ టు ఆల్పార్టీ: బాబు సెల్ఫ్ గోల్, జగనే సేఫ్!
విభజన తీరును ప్రతిపక్షాలు తప్పు పడుతున్న నేపథ్యంలో వాటిని ఇరుకున పెట్టేందుకే కేంద్రం మరోసారి అఖిల పక్షం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. విభజన తీరును రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది. బిజెపి కూడా తెలంగాణపై తాము వెనక్కి తగ్గమని చెబుతూ సీమాంధ్రులకు అన్యాయం చేయవద్దని చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు.
దీనిని ఎదుర్కొనేందుకే అఖిల పక్ష వ్యూహం అంటున్నారు. అఖిల పక్షం ద్వారా రాష్ట్రంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీని కాంగ్రెసు పార్టీ టార్గెట్ చేసుకున్నదని అంటున్నారు. ఇటీవలి వరకు సమన్యాయం అని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు సమైక్య రాగం ఆలపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. బిజెపి, సిపిఐ, తెరాసలు విభజన వైపు మొగ్గు చూపుతుండగా, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎంలు సమైక్య గళం వినిపిస్తున్నాయి.
విభజన తీరును బలంగా తప్పు పడుతున్న తెలుగుదేశం పార్టీని ప్రధానంగా ఇరుకున పెట్టేందుకే అఖిల పక్షం ఎత్తుగడ వేశారని అంటున్నారు. అదే సమయంలో విభజన నిర్ణయంపై అఖిల పక్షం వేశారా అని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు టిడిపి అఖిల పక్షానికి వెళ్తుందా? వెళ్తే ఏం చేస్తుందనేది అందరిలోను నెలకొన్న ఉత్కంఠ.
రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన జివోఎం మార్గదర్శకాలపై చర్చించేందుకు ఇప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమిటనే ప్రశ్నకు హోంశాఖ నుండి సరైన సమాధానం లభించటం లేదంటున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసిలో తీర్మానించిన అనంతరం కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని జివోఎంను ఏర్పాటు చేసారు. జివోఎం ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశమై విభజన ప్రక్రియను ముందుకు తీసుకుపోతోంది.
మరోవైపు హోంశాఖ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ హైదరాబాద్లో బైఠాయించి పోలీసు వ్యవస్థను రెండు రాష్ట్రాల మధ్య విభజించే అంశంపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో షిండే అకస్మాత్తుగా అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనేది చర్చనీయాంశంగా తయారైంది. జివోఎం మార్గదర్శకాలపై ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన అనంతరం ఆ పార్టీల నాయకులతో ముఖాముఖి చర్చలు జరపాలని షిండే భావిస్తున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం, వైకాపా, బిజెపి, తెరాస, సిపిఐ, సిపిఎం, మజ్లిస్, లోక్సత్తాలను అఖిలపక్ష సమావేశానికి పిలుస్తారు. తెలుగుదేశం సమన్యాయమంటూ సీమాంధ్రలో ఉద్యమిస్తుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి అధినాయకత్వం అఖిల పక్ష సమావేశంలో ఎలాంటి వైఖరిని అవలంబిస్తుందనేది వేచి చూడవలసిందే.
ఇప్పటికే సమైక్య గళం వినిపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అఖిల పక్షంలో బలంగా సమైక్యవాదం వినిపించే అవకాశముంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు సమైక్యాంధ్ర కోసం జగన్ లేఖ రాస్తారని చెబుతున్నారు. గతంలో అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులు రెండుగా చీలిపోవటం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇప్పుడేం చెబుతారో చూడాలి. అయితే అంతిమంగా ఢిల్లీ కాంగ్రెసుదే నిర్ణయం. ఈ నేపథ్యంలో టిడిపియే ఇరుకున పడ్డట్టుగా భావిస్తున్నారు.