డిమాండ్: తెలంగాణలో జిల్లాలను 24కు పెంచుతారా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు కొత్త జిల్లాల డిమాండ్ తెర పైకి వస్తోంది. తెలంగాణ ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త జిల్లాల ప్రతిపాదన తెచ్చారు. తెలంగాణను విస్తరించి పలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని తెరాస ఆవిర్భావం కంటే ముందునుంచే ఆందోళనలు సాగాయి.
రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా కేంద్రం హైదరాబాద్లో ఉండటంతో వికారాబాద్ను జిల్లా కేంద్రంగా చేయాలి లేదా వికారాబాద్ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఉండటంతో, అది ఏ ప్రాంతానికి కేంద్రంగా లేదని, సిద్దిపేట, మెదక్లలో కొత్త జిల్లాల కోసం గతంలో ఆందోళనలు జరిగాయి. ఇప్పుడున్న మెదక్ను మూడు జిల్లాలుగా మార్చాలనే యోచన కూడా ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 24 జిల్లాలు చేయాలనేది తెరాస ఆలోచన. దీనివల్ల అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ అందుతాయని గతంలో కెసిఆర్ ప్రకటించారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలనే ప్రతిపాదన ఒకటి, 24 జిల్లాలు చేయాలనే ప్రతిపాదన ఒకటి తెరాస రూపొందించింది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజక వర్గాలున్నాయి.
సమితిల స్థానంలో మండలాల ఏర్పాటు వల్ల పాలన సామాన్యుడి చెంతకు వచ్చిందని, పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర విభజన జరిగినట్టుగానే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల సంఖ్య పెంచాలనే అభిప్రాయం వినిపిస్తోంది.
హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ ఈస్ట్, భాగ్యనగర్, గొల్కొండ, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, భద్రాచలం, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్నగర్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేటలుగా చేయాలనే యోచన ఉందంటున్నారు.