స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు.. పవన్ కళ్యాణ్ కాలుష్య నివారణా సంకల్పం!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరీ పుష్కరాల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. 'స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు' థీమ్తో గోదావరి పుష్కరాలకు సిద్ధమవుతున్న వేళ గోదావరి నదిని సంపూర్ణ కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గోదావరిలో డ్రెయిన్ల ద్వారా కలుస్తున్న కాలుష్య కారక వ్యర్థాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి పవిత్రత ఉట్టిపడేలా స్వచ్చ గోదావరీ పుష్కరాలపై పవన్ కళ్యాణ్
పుష్కరాల నాటికి గోదావరి స్వచ్చంగా మారాలన్నారు. గోదావరి పవిత్రత ఉట్టిపడేలా, భక్తులు స్వచ్ఛమైన జలాల్లో స్నానమాచరించే వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు, గోదావరి నదిలో కలుస్తున్న అన్ని ప్రధాన, ఉప డ్రెయిన్లపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మురుగు, పారిశ్రామిక వ్యర్థాలపై శాస్త్రీయ విశ్లేషణ జరగాలన్న డిప్యూటీ సీఎం
రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు 15 ప్రధాన డ్రెయిన్లు, 45 వరకు మైనర్ డ్రెయిన్లు గోదావరి నదిలో కలుస్తున్నాయని, వాటి ద్వారా చేరుతున్న మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకాలపై శాస్త్రీయ విశ్లేషణ జరగాలని సూచించారు. పట్టణ ప్రాంతాల మురుగుతోపాటు గోదావరి తీరం వెంబడి ఉన్న 262 గ్రామ పంచాయతీల నుంచి వెలువడే మురుగుకు కూడా గోదావరి నదే అంతిమ గమ్యస్థానంగా మారడం ఆందోళనకర అంశమన్నారు.
బాధ్యులపై చట్టపరమైన చర్యలకు ఆదేశం
పరిమితికి మించి కాలుష్యాన్ని గుర్తించిన సందర్భాల్లో తక్షణం నియంత్రణ చర్యలు చేపట్టాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.
గోదావరి కాలుష్య నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని తెలిపారు. అవసరమైతే కాలుష్య నియంత్రణ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుంచి విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
గోదావరీ తీర గ్రామాల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ లక్ష్యంతో చర్యలు
గోదావరి తీరప్రాంత గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ లక్ష్యంతో చర్యలు ప్రారంభించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. పుష్కరాల నాటికి ఈ గ్రామాలను "మోడల్ పుష్కర పంచాయతీలు"గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలోనూ శుద్ధి చేయని మురుగు నీరు గోదావరిలో కలవకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
భవిష్యత్ లో అన్ని నదులు కాలుష్య రహితంగా మార్చే ప్లాన్
"స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు" అనే థీమ్తో సమగ్ర కార్యాచరణ కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గోదావరి ప్రక్షాళన విజయవంతంగా పూర్తైన అనంతరం కృష్ణా నదితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులను కూడా కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని చెప్పారు. భవిష్యత్తులో జరిగే కృష్ణా పుష్కరాలను కూడా ఇదే థీమ్తో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications