ఏపీలో కరోనా మాటున రాజకీయ నిర్ణయాలు ? లాక్ డౌన్ లోనూ ఆగని ఆదేశాలు.. !
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతున్నా తెరచాటున రాజకీయ నిర్ణయాలు కూడా అంతేవేగంగా సాగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్నా అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ వంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తాజాగా భూముల కేటాయింపుల రద్దుతో పాటు రాజధానిలో ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలు విడుదల చేయడం వివాదాస్పదమవుతోంది. కరోనా పై పోరును సీరియస్ గా తీసుకోవాల్సిన ప్రభుత్వం రాజకీయ నిర్ణయాలతో బిజీగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ 20 మందే బాధితులుగా ఉండగా... తాజాగా ఈ సంఖ్య చూస్తుండగానే ఒక్కసారిగా 143కు చేరిపోయింది. దీంతో కరోనా వైరస్ ప్రభావాన్ని తొలుత తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్ గా స్పందిస్తుందని, మిగతా అంశాలన్నీ పక్కనబెట్టి మరీ కరోనా వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తుందని ఎవరైనా అనుకుంటారు. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను గమనిస్తే ప్రభుత్వ నిబద్ధత ఏంటో ఇట్టే అర్ధమవుతుంది.

కరోనాలోనూ ఆగని నిర్ణయాలు..
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ ఎక్కువవుతోంది. అటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పూర్తిస్దాయిలో సౌకర్యాలు, వైద్య పరికరాలు లేవు. ఉన్నంతలో హడావిడిగా సమకూర్చుకుంటూనే కరోనాపై యుద్ధం చేయాల్సిన పరిస్ధితి. కానీ ఇలాంటి కీలక సమయంలోనూ రాజధాని వ్యవహారాలు, భూకేటాయింపుల రద్దు వంటి నిర్ణయాలతో ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలవుతోంది. గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో అకార్డ్ యూనివర్శిటీకి కేటాయించిన 120 ఎకరాల భూకేటాయింపులను తాజాగా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే కోవలో రాజదాని అమరావతిలో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇవన్నీ చూస్తున్న ప్రజలకు ప్రభుత్వం కరోనాపై పనిచేయడం మాని రాజకీయ నిర్ణయాలేంటని ఆశ్చర్యపోయే పరిస్ధితి.

కరోనా మాటున రాజకీయాలపై విపక్షాల విమర్శలు...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీలో మాత్రం ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు, భూకేటాయింపుల రద్దు, మార్గదర్శకాల మార్పు వంటి నిర్ణయాలు తీసుకోవడంపై విపక్ష టీడీపీ మండిపడుతోంది. లాక్ డౌన్ అమల్లో ఉండగా రాజధానిలో 1250 ఎకరాలను వైసీపీ కార్యకర్తలకు కేటాయించేందుకు వీలుగా మార్గదర్శకాలను మార్చడంపై టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.. ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు డబ్బుల్లేవంటూ రెండు రోజుల్లో కాంట్రాక్టర్లకు 6400 కోట్ల బిల్లులు ఎలా చెల్లించారని మరో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సాధారణ ప్రజల నుంచీ విమర్శలు...
రాష్ట్ర్రంలో కరోనా వైరస్ లాక్ డౌన్ పేరు చెప్పి తమను ఇళ్లకే పరిమితం చేసిన ప్రభుత్వం ఓవైపు కరోనా వ్యాప్తిని నిరోధించలేకపోవడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతుందన్న అసంతృప్తి సాధారణ జనంలో ఎక్కువవుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రభుత్వం రాజకీయ పరమైన నిర్ణయాలతో మొత్తం కరోనా వైరస్ టాపిక్ నే పక్కదోవ పట్టించేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షోభ సమయంలో రాజకీయాలను పక్కనబెట్టి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్న వైసీపీ నేతలు.. తమ సర్కారు నిర్ణయాలను ఎలా సమర్ధించుకుంటారని జనం ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications