ఇదీ దేవినేని 'చరిత్ర': గతాన్ని గుర్తుచేసుకుంటున్న అనుచరులు..
టీడీపీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుదామని ప్రయత్నిస్తున్న తరుణంలోనే దేవినేని అనారోగ్యం కారణంగా కన్నుమూయడం ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది
హైదరాబాద్: కృష్ణా జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అకాల మరణం రాష్ట్రవ్యాప్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు, సన్నిహితులు ఆయన రాజకీయ గతాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
విషాదం.. దేవినేని నెహ్రూ కన్నుమూత, బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర
1954లొ విజయవాడలో జన్మించిన దేవినేని నెహ్రూ.. యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు. వివాహం కాక మునుపు నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. బీఏ చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నా.. వృత్తి పరంగా వ్యవసాయాన్ని కూడా ఆయన కొనసాగిస్తూ వచ్చారు.
తండ్రి వారసత్వంతో:
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి యువతకు పెద్ద పీట వేసిన తర్వాత దేవినేని నెహ్రూకు పార్టీలో ప్రాధాన్యం లభించింది. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన ఐదుసార్లు కంకిపాడు నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం
1994-96మధ్యలో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ కు సన్నిహితంగా మెలిగిన నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్న దేవినేని.. మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా మధ్యలోకాంగ్రెస్ లో చేరారు. ఇటీవలే తిరిగి టీడీపీలో చేరిన ఆయన.. ఆ సందర్బంగా పుట్టింటికి వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు.
యాక్టివ్ అవాలనే ప్రయత్నంలో:
టీడీపీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుదామని ప్రయత్నిస్తున్న తరుణంలోనే దేవినేని అనారోగ్యం కారణంగా కన్నుమూయడం ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. టీడీపీలో చేరిన తర్వాత పలువురు జర్నలిస్టులతో సైతం ప్రస్తుత రాజకీయాల గురించి దేవినేని చర్చలు జరిపారు.
మంత్రి పునర్వవ్యవస్థీకరణపై ఇలా:
ఇటీవల మంత్రి పునర్వవ్యవస్థీకరణ సందర్భంగా ఎమ్మెల్యేల్లో అసంతృప్తులు పెల్లుబికడంతో.. దానిపై కూడా దేవినేని తన అనుచరులు, సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎవరైనా సరే పార్టీ నియమావళికి కట్టుబడి ఉండాలని, ఈ విషయంలో అధినేత చంద్రబాబుకు అండగా నిలబడాలని ఆయన భావించినట్లు చెబుతున్నారు.
గత 15రోజులుగా..:
15రోజుల క్రిత టైఫాయిడ్ రావడంతో.. ఈ రెండు వారాల నుంచి ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 5.20గం.కు కన్నుమూశారు. నమ్మినవారి కోసం ఏమైనా చేసే గుణం దేవినేని సొంతం అని ఆయన అనుచరులు గుర్తుచేస్తున్నారు. దేవినేని మరణంతో కుటుంబ సభ్యులు, అనుచరులు హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రికి తరలివస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ దేవినేని రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమారుడు కొనసాగించాలని ఆకాంక్షించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.