కెసిఆర్, జగన్ డ్రామాలు: ఉమ, కెసిఆర్పై పొన్నాల
విజయవాడ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు బయటపడ్డాయని తెలుగుదేశం సీమాంధ్ర నాయకుడు దేవినేని ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు. తాము రాహుల్ ప్రధాని అయ్యేట్లుంటే మద్దతిస్తామని, సీమాంధ్రలో జగన్ అధికారంలోకి వస్తారని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం ఆ విధంగా ప్రతిస్పందించారు. జగన్, కెసిఆర్ డ్రామాల గురించి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరు నెలల నుంచీ ఇదే విషయం చెబుతున్నారని ఆయన అన్నారు.
కాగా, కెసిఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. కెసిఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ మొన్న తృతీయ కూటమి అన్నారు, ఇప్పుడు రాహుల్ ఫ్రంట్ అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో తమ పార్టీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదేనని ఆయన అన్నారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహులకు టికెట్లు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ నీరు గార్చారని ఆయన అన్నారు.
తెరాస ఎన్నికల ప్రణాళికలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఉన్నాయని ఆయన అన్నారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications