దేవినేని వ్యాఖ్య: బాబుకు ఝలకా, కెసిఆర్కు షాకా?, 'జగనే కుట్రలకు సూత్రధారి'
విజయవాడ: ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం నాడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీలో కలిపిన ముంపు మండలాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదన ఏదీ తాము చేయలేదని స్పష్టం చేశారు.
ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక అంతకుముందు రోజు అంటే సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలే కారణం కావొచ్చు. కెసిఆర్ సోమవారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీలో కలిసిన నాలుగైదు గ్రామాలను వెనక్కి ఇవ్వడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని, త్వరలోనే అవి మనకు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ముంపు మండలాల పైన దేవినేని మాట్లాడటం గమనార్హం.
మంగళవారం నాడు దేవినేని మాట్లాడుతూ... ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో కలిపిన ముంపు మండలాలను తెలంగాణలో కలిపే ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు. చంద్రబాబు హామీ ఇచ్చారని కెసిఆర్ చెప్పగా, అలాంటి ప్రతిపాదన లేదని దేవినేని చెప్పడం గమనార్హం.
మరోవైపు, దేవినేని వైసిపి అధినేత జగన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం అడ్డుకునేందుకే జగన్ కేసులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం దౌర్భాగ్యమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఎలాంటి కసితో పూర్తి చేశామో.. అదే కసితో హంద్రీనీవా, గాలేరు-నగరి పూర్తి చేస్తామన్నారు.
2018 నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలనేది తమ సంకల్పమని చెప్పారు. జగన్, ఆయన పత్రిక్ సాక్షి ఎన్ని అడ్డగోలు రాతలు రాసినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే చూపిస్తామన్నారు. ఈ సంవత్సరం అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలకు హంద్రీనీవా, గాలేరు-నగరి నీరు ఇస్తామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.2500 కోట్లు రాకుండా అడ్డుపడాలనేది జగన్ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.
ఏపీలో జరిగే అన్ని కుట్రలకు జగనే కారణమని దుమ్మెత్తి పోశారు. ప్రతిపక్ష నేతలు ఎక్కడైన అభివృద్ధిని కోరుకుంటారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. కుల, మత, ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తూ జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అయినప్పటికీ టిడిపి ప్రజల కోసం కష్టపడుతోందన్నారు.