ఏపీఎస్ఆర్టీసీ అద్భుత టూర్ ప్యాకేజీ
APSRTC: ఈ నెల 16వ తేదీన తెల్లవారు జామున 6:57 నిమిషాలకు ధనుర్మాస ఘడియలు ఆరంభం అయ్యాయి. శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఉంది ధనుర్మాసానికి. ఈ మాసం పొడవున్నా తిరుమల సహా శ్రీవేకంటేశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలను నిర్వహిస్తుంటారు. 12 మంది అళ్వార్లు రచించిన తిరుప్పావై పాశురాలను పఠిస్తుంటారు.
ఈ పవిత్ర మాసోత్సవాలను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ప్యాకేజీ టూర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకే రోజులో సప్త శ్రీనివాస దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. అప్పనపల్లి, యానాం, మండపేట, వాడపల్లి, అన్నవరప్పాడు, కొడమంచిలి, అబ్బిరాజుపాలెంలల్లో గల ఆలయాలను కలిపి సప్త శ్రీనివాస దర్శనం ప్యాకేజీగా ప్రకటించారు.

అలాగే- పంచ వైష్ణవ దేవాలయాల దర్శన టూర్నూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్యాకేజీ కింద అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి, అప్పనపల్లి వెంకటేశ్వరస్వామి, గొల్లమామిడాడ కోదండరామస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, ద్వారకా తిరుమల వేంకటేశ్వరుడి దేవస్థానాలను దర్శించవచ్చు.
దీనితో పాటు- త్రిముఖ వైష్ణవ దర్శనం ప్యాకేజీ కింద ఒకే రోజులో ద్వారకా తిరుమల, వాడపల్లి, అన్నవరం ఆలయాలను సందర్శించే అవకాశాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. ఇందులో సప్త శ్రీనివాస దర్శనం ప్యాకేజీ ఛార్జీ 900 రూపాయలుగా నిర్ధారించారు.
పంచ వైష్ణవ దేవాలయాల దర్శన టూర్ ప్యాకేజీ ఛార్జీ 1,300 రూపాయలు, త్రిముఖ వైష్ణవ దర్శనం ప్యాకేజీ ఛార్జీ 1,050 రూపాయలుగా నిర్ణయించారు. ఈ మూడు ఆలయ టూర్ ప్యాకేజీల కోసం సూపర్ లగ్జరీ బస్సులను వినియోగిస్తారు. ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి మచిలీపట్నం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. గ్రూపులుగా వెళ్లదలిచిన వారి కోసం ఇంటి వద్దకే బస్సులను పంపిస్తారు.












Click it and Unblock the Notifications