జగన్ నో: చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన ధర్మాన
హైదరాబాద్/శ్రీకాకుళం: మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అపాయింటుమెంట్ కోరారట. చంద్రబాబు అపాయింటుమెంటును ధర్మాన కోరారని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సోమవారం చెప్పారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
కాగా, ధర్మానకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నో చెప్పినట్లుగా మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు చెప్పిన విషయం తెలిసిందే.
సోమవారం ఉదయం అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన శత్రుచర్ల... ధర్మానకు జగన్ టిక్కెట్ ఇవ్వనని చెప్పారని, తాను నియోజకవర్గంలో లక్ష మందితో సమావేశం పెడతానని జగన్తో ధర్మాన అంటే.. జనం నిన్ను చూసి వస్తారా లేక నన్ను చూసి వస్తారా అని జగన్ ఎద్దేవా చేశారని చెప్పారు. ధర్మాన ప్రసాద రావుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అపాయింటుమెంట్ కోరడం గమనార్హం.
చర్చ జరగాలి: యెండల
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన శాసన సభలో చర్చను కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ వేరుగా డిమాండ్ చేశారు. తీర్మానం పైన చర్చ జరగకుండా అడ్డుకుంటున్న వారిని సభ నుండి సస్పెండ్ చేయాలన్నారు.
బిఏసి సమావేశంలో ఏకాభిప్రాయం రాకుండా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.