ఆ కూలీ పంట పండింది .. వజ్రం దొరికింది .. ఆ తర్వాత
ఇప్పుడు కర్నూలు ,అనంతపురం వాసులు పిల్లాపాపలతో సహా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట ప్రారంభించారు. ఈ అన్వేషణ ప్రతీ సంవత్సరం జరిగేదే అయినా ఈ సంవత్సరం కాస్త ముందుగానే వజ్రాల వేట ప్రారంభించారు. అదృష్టం కలిసొచ్చిన వాళ్లకు వజ్రాలు దొరుకుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఒక కూలీకి వజ్రం దొరకింది.
సొంత పొలంలో దొరికిన ఆరు క్యారెట్ల బరువున్న వజ్రం .. వ్యాపారుల కొనుగోలు
కర్నూలు జిల్లా తుగ్గలి మండల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే పండగే. ఈ ప్రాంతంలోని పొలాల్లో వర్షాలు ప్రారంభం కాగానే వజ్రాల వేట మొదలవుతుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాదు, ఎక్కడెక్కడి నుండో వచ్చి మరీ వజ్రాల కోసం పొలాల్లో వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయల విలువ చేసే వజ్రాలు దొరకడం మామూలే. ఇప్పటికే చాలా మందికి వజ్రాలు దొరికి అదృష్ట లక్ష్మి వరించగా తాజాగా, పగిడిరాయి గ్రామానికి చెందిన ఓ మహిళకు తన సొంత పొలంలో ఆరు క్యారెట్ల బరువున్న వజ్రం దొరికింది. విషయం తెలియడంతో వెంటనే వాలిపోయిన అనంతపురం జిల్లా గుత్తి వ్యాపారులు నాలుగు లక్షల రూపాయల నగదు, మూడు తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఓ వ్యవసాయ కూలీకి రూ.13 లక్షల విలువైన వజ్రం దొరికింది. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో బొళ్లవానిపల్లిలో వ్యవసాయ కూలీకి లభించిన రూ.13 లక్షల వజ్రం తర్వాత ఇదే ఖరీదైందని తెలిసింది.
పొట్ట కూటికే తిప్పలు పడే పలువురికి దొరకిన వజ్రాలు
అనంత పురం జిల్లా అలాగే కర్నూలు జిల్లాలలో తొలకరి వర్షాల సమయంలో వజ్రాలు దొరుకుతాయి. దీంతో ప్రతి ఏటా ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తారు స్థానికులు. సాధారణంగా తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే సాగే ఈ అన్వేషణ ఈసారి కాస్త ముందుగానే మొదలైంది. పొలాల్లో అడుగడుగూ అన్వేషించే వీరికి ఒక్క వజ్రం దొరికితే చాలు జాతకం మారిపోతుందని చాలా ఆశగా వెతుకుతారు . అలాగే పొట్ట కూటికే తిప్పలు పడే పలువురికి ఇప్పటికే చాలా సార్లు వజ్రాలు దొరికి లక్షాధికారులు అయిపోయారు.
అనంతపురం జిల్లాలోనూ తాజాగా ఇద్దరికి దొరికిన వజ్రాలు
వజ్రకరూర్ సమీపంలోని ఉయ్యాల గుట్ల , గ్యాస్ గోదాం, మక్కిరేని కుంట పొలాల్లో వజ్రాల కోసం వెతికారు. ఒక్క వజ్రం దొరికినా కష్టాలు తీరిపోతాయని భావించి చీకటి పడేవరకు వజ్రాల కోసం వేట సాగించారు. ఇటీవల ఇద్దరు వ్యవసాయ కూలీలకు వజ్రాలు దొరికాయి. స్థానిక వ్యాపారి వాటిని ఒక కోటి ముప్పై లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో చాలా మంది అసలు పనులు పక్కన పెట్టి మరీ వజ్రాల వేటలో పడ్డారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ వారికి కనీసం ముప్పై నుండి నలభై వజ్రాలు లభిస్తాయి . వజ్రాలు లభించినవారి జీవితం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే .