'టీడీపీలో కుమ్ములాటలు, సభలో వాళ్లను వాళ్లే తన్నుకున్నారు'
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయని, శాసన సభలో వాళ్లను వాళ్లే తన్నుకొని నెపాన్ని తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పైకి నెడుతున్నారని తెరాస ఆరోపిస్తోంది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం శాసన సభాపక్ష కార్యాలయంలో మాట్లాడారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తొత్తులు కొందరు తెలంగాణ శాసన సభలో గలాటా సృష్టించే ప్రయత్నం చేశారని, ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని కొప్పుల ఈశ్వర్ అన్నారు. వారి తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు కూడా జాతీయ గీతాలాపన సందర్భంగా బెంచీలు ఎక్కడం సిగ్గుచేటు అన్నారు.
బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ ఆర్కిటెక్ట్లా పని చేస్తూ పకడ్బందీ ప్లాన్ అమలు చేస్తున్నారని తెరాస నేత జితేందర్ రెడ్డి పాలమూరులో అన్నారు. సీమాంధ్రులు 60 ఏళ్ల పాటు తెలంగాణ నీళ్లు, నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
ఈ పరిస్థితి నుంచి తెలంగాణను గట్టెక్కించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గడచిన తొమ్మిదిన్నర నెలలుగా కేసీఆర్ అవిశ్రాంత కృషి చేస్తున్నారన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అందరికీ రక్షిత మంచినీటిని అందించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు 42 శాతం నిధులు రానున్నాయని చెప్పారు.