పోలవరం: జగన్ పార్టీలో భిన్నవాదన, జగన్ ఏం చెప్తారు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో పోలవరం ఆర్డినెన్స్ పైన బేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఎంపీలు ఓకే వేదిక పైన విరుద్ధమైన వాదనలు వినిపించారు. శనివారం జగన్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
ఈ సమావేశంలో ఆర్డినెన్స్ పైన విలేకరులు ప్రశ్నించారు. ఈ ఆర్డినెన్స్తో ఎవరికీ నష్టం లేదని, విభజనపై పార్లమెంటులో చర్చ సందర్భంగా చెప్పిన ప్రకారమే ఉభయ ప్రాంతాల వారికి ప్రయోజనకరంగానే ఈ అంశాన్ని పొందు పర్చారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు.

పక్కనే ఉన్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం.. తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా పోరాడుతామని, ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని, ఆంధ్రాలో కలిపితే ఒప్పుకోమని వ్యాఖ్యానించారు. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ కోసం పోరాడామని, ఈ ఆర్డినెన్స్లోని లోపాలను పార్లమెంటులో ప్రస్తావించి పోరాడుతామని చెప్పారు.
కాగా, పోలవరం ఆర్డినెన్స్ పైన గట్టు రామచంద్ర రావు రెండు రోజుల క్రితం మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం సరికాదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాయకులు వేర్వేరు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications