డిగ్గీ టీ ఆపరేషన్: ఈ అసెంబ్లీ సెషన్లోనే డ్రాఫ్ట్ బిల్లు?
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే విధంగా కార్యాచరణను రూపొందించి, అమలు చేయించడానికే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన హైదరాబాద్కు చేరుకున్నప్పటికీ తీరిక లేకుండా కాంగ్రెసు నాయకులను కలుసకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. అయితే, తాను సహకరించబోనని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి సహకారం లేకపోయినా తెలంగాణ ముసాయిదా బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా దిగ్విజయ్ సింగ్ రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణపై వెనక్కి తగ్గలేని స్థితికి కాంగ్రెసు అధిష్టాన చేరుకుంది. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం.
దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ రావడం కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి సురేష్ కుమార్ ప్రత్యేక విమానంలో తెలంగాణ ముసాయిదా బిల్లును తీసుకుని రావడం కొన్ని గంటల తేడాతో ఒకే రోజు జరిగాయి. అసెంబ్లీ అభిప్రాయం తెలపడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 23వ తేదీ వరకు సమయం ఇచ్చినప్పటికీ ఈ సమావేశాల్లోనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో దిగ్విజయ్ సింగ్ ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి అందించిన తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ కార్యదర్శి సురేష్ కుమార్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. సురేష్ కుమార్ ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ను కలిశారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీకి తేవడంలో గవర్నర్ పాత్రే కీలకం కానున్నట్లు చెబుతున్నారు.
కాగా, 8 బండిల్స్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులు గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నాయి. మొత్తం 390 ప్రతులను ఢిల్లీలో సిద్ధం చేసి తీసుకుని వచ్చారు. రేపు సాయంత్రంలోగా శానససభ్యులందరికీ ఆ ప్రతులను అందజేయనున్నట్లు చెబుతున్నారు. 120 పేజీల బిల్లు ప్రతులను, 30 పేజీల ముసాయిదా నోట్ ప్రతులను సురేష్ కుమార్ తీసుకుని వచ్చారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాతనే దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ నుంచి కదులుతారని అంటున్నారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, మంత్రులు కూడా ముసాయిదా బిల్లును వీలైనంత త్వరగా అసెంబ్లీకి తెచ్చేందుకు అవసరమైన ఒత్తిడి తేవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.