'దిల్' రాజుకు చెక్ పెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్?
విజయవంతమైన డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని సృష్టించుకున్నారు దిల్ రాజు. అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న తరుణంలోనే కొన్నాళ్ల నుంచి సినిమాలు చేయకుండా ఖాళీగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ట్రేడ్ పండితులు అంటున్నారు. విజయ్ తో వారసుడు చేసిన తర్వాత రామ్ చరణ్ తో శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నారు. శంకర్ భారతీయుడు2 షూటింగ్ లో ఉండటంతో రామ్ చరణ్ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.
వాస్తవానికి పరిశ్రమలో దిల్ రాజు ఆధిపత్యానికి మైత్రీ మూవీ మేకర్స్ చెక్ పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీమంతుడు సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి.. ఈ బ్యానర్ కు అధినేతలు. జనతా గ్యారేజ్, రంగస్థలం, సవ్యసాచి, గ్యాంగ్ లీడర్, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, పుష్ప, ఖుషీ.. తదితర సినిమాలన్నీ ఆ బ్యానర్ పై వచ్చినవే. వాటిల్లో ఎక్కువ భాగం బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలవడంతోపాటు చేయబోతున్న ప్రాజెక్టులన్నీ క్రేజీగా ఉన్నాయి. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉన్న సినిమాలపై పెట్టిన బడ్జెట్ రూ.1200 కోట్లని అంచనా వేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లందరికీ వీరు ముందుగానే అడ్వాన్స్ లు ఇచ్చేశారు. ఇతర నిర్మాతలమీద వీళ్లు ఒక రూపాయి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అడ్వాన్స్ ఇచ్చి డేట్లు కుదరకపోయినప్పటికీ తిరిగి అడగకపోవడం వీరికి ప్లస్ పాయింట్ గా మారింది. సినీ నిర్మాణంలో విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగుపెట్టారు. ఈ రంగంలో నైజాంకు సంబంధించి దిల్ రాజుదే ఏకచత్రాధిపత్యం. ఆయన చెప్పిన రేటుకే సినిమాను విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలకు పర్వాలేదుకానీ మీడియం, చిన్న బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించేవారికి మాత్రం ఆయన కండిషన్లు మింగుడు పడేవి కావు. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి.
అన్నీ ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా సెట్స్ మీదకు వెళ్లడం అసాధ్యం. దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేసినవారు మొదటి మూడు లేదంటే మొదటి ఐదు సినిమాలపై కచ్చితంగా ఆయనకే చేయాల్సిన పరిస్థితి. చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్లను తన చేతిలో ఉంచుకొని పరిశ్రమను శాసిస్తున్నాడంటూ ఆయనపై విమర్శలున్నాయి. డైరెక్టర్లనే కాకుండా కొంతమంది హీరోలను కూడా దిల్ రాజు తనని కాదని సినిమాలేవీ చేయకూడదనే విధంగా భయపెడుతున్నారంటున్నారు.
హీరోలు, డైరక్టర్లు తనకు తెలియకుండా బయట ఏ ప్రాజెక్టు ఒప్పుకోకూడదనే కండిషన్లు పెడతారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ లాంటి డైరెక్టర్ దిల్ రాజు బ్యానర్ లో మూడు సినిమాలు చేశాడు. వంశీ పైడిపల్లి మాత్రం ఏ సినిమా చేయాలన్నా దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తుంటాడు. బలగం సినిమాతో మంచి హిట్ అందుకున్న వేణు లాంటి డైరెక్టర్ కూడా దిల్ రాజు చెప్పినట్లుగా చేస్తూ ఆయన ప్రొడక్షన్ లోనే సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు సంబంధించి వ్యాపారం ఎలా చేయాలో దిల్ రాజుకు బాగా తెలుసు అంటుంటారు. ఇటువంటి తరుణంలోనే మైత్రీ మూవీ మేకర్స్ దిల్ రాజుకు సవాల్ విసరడంతో ఆయన కూడా వారితో పోటీపడటానికే సిద్ధమయ్యారు. ఆయన ఆధిపత్యాన్ని తగ్గించేందుకే మైత్రీవారు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల కాల్షీట్లన్నీ అడ్వాన్స్ రూపంలో హోల్డ్ చేశారు. సినీ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఆధిపత్యం సాగుతున్న వీరి పోరాటం మున్ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications