సంబరాలా,బాధనా: కోదండ, ఎపిలో టి ఉద్యోగులు: అశోక్
హైదరాబాద్: పోలవరం విషయంలో ఒకరిని ముంచి మరొకరిని పైకి రావడం భావ్యం కాదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు శనివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆదివాసీ జాతి మాయం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయస్థానాల నుంచి అభ్యంతరాలు ఉన్నా, పర్యావరణ సమస్యలు ఉన్నా ప్రభుత్వం పోలవరం విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం శోచనీయమన్నారు. ఆర్డినెన్సును రద్దు చేయాలనే డిమాండ్తో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం కోయిదా గ్రామం నుంచి చేపట్టిన పాదయాత్రను కోదండరాం ప్రారంభించి, మాట్లాడారు.

ఆర్డినెన్సు రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్లే ఇచ్చి ఏడు మండలాలను సీమాంధ్రకు కట్టబెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించామనే ఆనందం లేకుండా చేసిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చినందుకు సంబరాలు చేసుకోవాలో లేక ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపినందుకు బాధపడాలో తెలియని రీతిలో విభజన జరిగిందన్నారు.
తాత్కాలికమే: అశోక్ బాబు
ఉద్యోగుల పంపిణి తాత్కాలికమే అని ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలంటే ముందుగా ఉద్యోగుల పంపిణి జరగాల్సి ఉందని, అయితే ఇప్పుడు ఒక్క సచివాలయ ఉద్యోగులను మాత్రమే పంపిణి చేశారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యోగులు కూడా పని చేయవచ్చన్నారు. ఇక్కడ ఏపీ ఉద్యోగులను తెలంగాణ ఉద్యోగ సంఘాలు కించపర్చుతూ మాట్లాడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications