చంద్రబాబుకే అసమ్మతి సెగ...పార్టీలో చర్చనీయాంశంగా అసంతృప్తుల గైర్హాజరు వ్యవహారం
కర్నూలు జిల్లాలో టిడిపి అసంతృప్తి నేతల వ్యవహారం సెగ ఏకంగా సిఎం చంద్రబాబునే తాకింది. జొన్నగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన నవనిర్మాణ దీక్షకు కీలక నేతలు గైర్హాజరు కావడం కలకలం రేపింది.
స్వయంగా ఎపి సిఎం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ రాజకీయాల కారణంగా కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు , బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి, మరికొందరు జిల్లా టిడిపి నేతలు ఈ గైర్హాజరు జాబితాలో ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎవి సుబ్బారెడ్డి జోక్యం పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్న పర్యటక మంత్రి భూమా అఖిలప్రియ స్వయంగా సిఎం చంద్రబాబే పంచాయతీ చేసినా, ఆ సమావేశంలో పరిస్థితి తనకు అనుకూలంగా లేదని ఫీలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత గోదావరి పడవ ప్రమాదం సమయంలో కూడా కనిపించని మంత్రి ఆ తర్వాత సిఎం చంద్రబాబును కలసి తన వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు. దీంతో ఆమె ఇకపై సిఎం చంద్రబాబుకు విధేయతతో ఉంటారనే అంచనాలను తల్లకిందులు చేస్తూ తాజాగా ఆమె మరోసారి సిఎం పర్యటనకు డుమ్మా కొట్టడం ద్వారా వార్తల్లో నిలిచారు.
మరోవైపు గత కొంతకాలంగా టిడిపి అధిష్టానంపై అలకబూనిన బనగానపల్లె ఎమ్మెల్యే జనార్ధన్రెడ్డి ఇటీవలి కాలంలో జరిగిన అన్ని టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు ఏకంగా సిఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకే గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయింది. మొన్న మినీ మహానాడు, నిన్న మహానాడు, తాజాగా నియోజకవర్గంలో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలకు కూడా ఆయన హాజరు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో జనార్ధన్రెడ్డి పార్టీ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని చెప్పకనే చెప్పినట్లయిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలావుంటే మరోవైపు సిఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన నిరాటంకంగా సాగిపోయింది. తొలుత జొన్నగిరిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఆ తరువాత స్థానికంగా ఉన్న ఎస్సీ, బీసీ కాలనీలను సందర్శించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం జొన్నగిరి గ్రామసభలో సీఎం పాల్గొన్నారు. హంద్రీనీవా పథకం నుంచి 68 చెరువులకు నీరు నింపే కార్యక్రమానికి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. రాష్ట్రంలో 5 లక్షల పంటకుంటలు తవ్విన సందర్భంగా చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు.