దమ్ముంటే జగన్ ఆడ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ట్రోల్ చెయ్యండి, ఖలేజా ఉన్న నాయకుడు చంద్రబాబు : దివ్య వాణి ధ్వజం
తెలుగుదేశం పార్టీలో టిడిపి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న దివ్యవాణి మరోమారు యాక్టివ్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇటీవల దివ్యవాణి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు అన్నట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో,ఆ వార్తలను ఖండించిన దివ్యవాణి, కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేశారని మండిపడుతున్నారు. వైయస్సార్సీపి సోషల్ మీడియా చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ మానుకోవాలని దివ్యవాణి హితవుపలికారు.

తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన దివ్యవాణి
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, నందిని పందిని పందిని నందిని చేసి చూపించడంలో వైసిపి సోషల్ మీడియా వాళ్ళు ఎక్స్పర్ట్ లని పేర్కొన్న దివ్యవాణి, తాను మాట్లాడిన మాటలను ముందు వెనుక ఎడిట్ చేసి వారికి అనుకూలంగా ఉండే విధంగా దానిని మార్ఫ్ చేసి తానే మాట్లాడినట్టు, వైసీపీలో చేరుతున్నట్టు జరిగిన ప్రచారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నీచమైన రాజకీయాలకు, సిగ్గులేని రాజకీయాలకు ఇది ప్రతీక అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు దివ్యవాణి. తాను టిడిపిలోనే కొనసాగుతానని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో వైసిపి సోషల్ మీడియా గ్రూపులకు ఛాలెంజ్ విసిరారు.

సీఎం జగన్ ఆడ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ట్రోల్ చెయ్యాలని ఛాలెంజ్
దమ్ము, ధైర్యం ఉంటే ఇటీవల సీఎం జగన్ మాట్లాడిన రాష్ట్రంలో ఆడ ముఖ్యమంత్రి అన్న మాటలను ట్రోల్ చేయాలని, అసెంబ్లీలో వైసిపి ఆడ రౌడీలు అదిగదిగో సీఎం చంద్రబాబు అన్న మాటలను ట్రోల్ చేయాలని సవాల్ విసిరారు. టిడిపి నేతలు ఎవరూ కలత చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న దివ్యవాణి ఖలేజా ఉన్న చంద్రబాబు నాయుడు వద్ద పని చేయడం గర్వంగా ఉందన్నారు.
ఇదే సమయంలో సీతానగరం అత్యాచార బాధితురాలి విషయంలో దివ్యవాణి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

సీతానగరం అత్యాచార బాధితురాలికి జగన్ చేసిన న్యాయం ఇదేనా
సీతానగరం అత్యాచార బాధితురాలికి ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు న్యాయం చేయలేక పోయారని దివ్యవాణి ప్రశ్నించారు. ఇక అత్యాచారానికి ఒడిగట్టిన వారు అధికార పార్టీకి సంబంధించిన వారనా అంటూ నిలదీసిన దివ్యవాణి, తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ తక్షణమే నిందితులకు శిక్ష పడేలా చేయాలని పేర్కొన్నారు. సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగి 40 రోజులు కావస్తోంది , అయినా నిందితులను పట్టుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో చెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.

పరిపాలన అంటే కోడి కత్తి డ్రామాలు కాదు
పరిపాలన అంటే కోడి కత్తి డ్రామాలాడడం, వివేకానంద రెడ్డి హత్య కేసును టిడిపి నేతల మీద రుద్దటం కాదని, మీ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే ఇప్పటివరకు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు దివ్యవాణి . సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర 144 సెక్షన్ ఉండాలని, సీఎం జగన్ ఎక్కడికైనా వెళితే ఒక పెద్ద మహారాజులా పోలీసులు సైన్యం ముందు కదలాలని, కానీ మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఆడవారికి కూడా రక్షణ లేకుండా పోయింది అన్న విషయం జగన్ కు అర్థం కావడం లేదా అని ఎద్దేవా చేశారు.

గన్ కంటే ముందు జగన్ వస్తే ఎక్కడ .. బాధితురాలికి న్యాయం జరిగిందా ?
మీ రౌడీ ఆడ ఎమ్మెల్యేలు మా గుండె జగనన్న జగనన్న అని కొట్టుకుంటుంది అని, మరొకరు గన్ కంటే ముందు జగన్ అన్న వస్తాడు అని చెప్పుకున్నారని మరి ఇప్పుడు సీతానగరం అత్యాచార బాధితురాలి విషయంలో జగనన్న ఎందుకు రాలేదో చెప్పాలని నిలదీశారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని జగనన్న బాణం షర్మిల అంటున్నారు కానీ ఈ ముఖ్యమంత్రి అలా భావించటం లేదని విమర్శించారు దివ్యవాణి. సీతానగరం అత్యాచార బాధితురాలి కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డిని కూడా డిజిపి విచారించాలని దివ్యవాణి డిమాండ్ చేశారు.

జగనన్న బాణం చెప్పిన సీఎం అంటే కామన్ మ్యాన్ ... ఎక్కడ ?
నిందితులకు రామకృష్ణారెడ్డి కొమ్ముకాస్తున్నారని తమకు అనిపిస్తోంది అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక అనవసరమైన అన్ని విషయాల్లో తలదూర్చే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలో జరిగిన అత్యాచార ఘటన పై ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు. ఆంధ్రాలో మహిళలకు రక్షణ లేదని మండిపడిన దివ్యవాణి జగనన్న బాణం షర్మిల చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసి ఒక కామన్ మ్యాన్ గా జగన్ ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి బయటకు రాలేక పోతున్నారు అంటూ విమర్శించారు. అమరావతిలో గత రెండున్నరేళ్లుగా చిన్న పెద్ద తేడా లేకుండా రాష్ట్ర రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తుంటే సీఎం గారు కామన్ మెన్ గా బయటకొచ్చి వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకో లేదంటూ నిలదీశారు.
2024లో చంద్రబాబే సీఎం .. ప్రజలకు ఆయన విలువ తెలిసింది
ఇదే సమయంలో గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అన్న షర్మిల వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన దివ్యవాణి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
మొత్తానికి తాజా రాజకీయ పరిణామాలపై తనను ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియాపై విరుచుకుపడటమే కాకుండా సీతానగరం అత్యాచార బాధితురాలికి న్యాయం జరగలేదని, సీఎం జగన్ ఏం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు దివ్యవాణి. 2024 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని, ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఆయన విలువ తెలిసింది కనుక వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని దివ్యవాణి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications