వాళ్లు చెప్పారనే: పవన్ కళ్యాణ్పై చంద్రబాబు, బిజెపి నేత నో కామెంట్
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాజిటివ్ దృక్పథంతో చేసిన సూచనను పరిగణలోకి తీసుకోవాలని, తమ పార్టీకి చెందిన నేతలు ఎవరు కూడా పవర్ స్టార్ను విమర్శించవద్దని ఏపీ సీఎం, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ రైతుల కోసం పాజిటివ్ దృక్పథంతో సూచనలు చేస్తున్నారన్నారు. అవసరమైతే తాను స్వయంగా కలిసి పవన్ కళ్యాణ్కు అన్ని విషయాలు చెబుతానని చెప్పారని సమాచారం. రైతుల విషయంలో పవన్ అనుమానాలు నివృత్తి చేస్తానని చెప్పారని తెలుస్తోంది.

కొంతమంది రైతులు పవన్ కళ్యాణ్ను ఆశ్రయించినందునే వారి సంక్షేమం కోసం ఆయన మాట్లాడుతున్నారని, అందులో ఎలాంటి తప్పులేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భూసేకరణ పైన వాస్తవ పరిస్థితులను పవన్కు తెలియజేస్తామన్నారు.
కాగా, పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పోరాడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులను కలుసుకుంటారు. వారి ఆందోళనలో పాల్గొంటారు.
మరోవైపు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్తో దోస్తీ కొనసాగించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మిత్ర బంధం విడిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో పర్యటించిన అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు. పెనుమాక సమావేశంలో రైతులు వ్యక్తం చేసిన ఆందోళనలను ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ట్వీట్లపై తానేమీ మాట్లాడదలచుకోలేదని బిజెపి నేత, ఏపీ మంత్రి మాణిక్యాల రావు చెప్పారు. రాజధాని నిర్మాణం అంటే భూమి తప్పనిసరి అన్నారు. భూసేకరణకు రైతులు సహకరించాలన్నారు. పార్లమెంటులో భూసేకరణ చట్టాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.












Click it and Unblock the Notifications