ఆపరేషన్ చేసి దూదిని కడుపులో మరిచారు: నరకం చూసిన మహిళ
విజయనగరం: వైద్యుల నిర్లక్ష్యం ఓమహిళను నరకం అనుభవించేలా చేసింది. ప్రసవం కోసం వచ్చిన ఆ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. వైద్యం కోసం వాడిన దూదిని కడుపులోనే ఉంచేసి కుట్లు వేశారు. దీంతో ఆమె కొద్ది రోజులకే అనారోగ్యం పాలైంది. అంతేగాక, తీవ్రమైన నొప్పితో నరకం చూసింది. ఈ ఘటన విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. విజయనగరం మండలం గరుడబిల్లికి చెందిన నవ్యశ్రీకి నెలలు నిండడంతో గత మే 21న విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.
తరువాతి రోజునే ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స చేయగా అమ్మాయి పుట్టింది. అప్పటి నుంచి కడుపునొప్పి వేధిస్తోండడంతో మూడో రోజునే శస్త్రచికిత్స చేసిన వైద్యురాలిని కలిశారు. ఆమె పట్టించుకోలేదు.

తీరా ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాక కడుపునొప్పి మరింత పెరిగిపోవడంతో నవ్యశ్రీ తట్టుకోలేకపోయారు. పదేపదే ఆసుపత్రి చుట్టూ తిరిగారు. అయినా వైద్యురాలు మందులు రాసిచ్చి ఇదంతా మామూలేనని కొట్టిపారేశారు. ఐదున్నర నెలల నరకయాతన తర్వాత 15 రోజుల క్రితం మళ్లీ ఆసుపత్రికి వెళ్లగా అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష రాశారు. అది చేయించుకుంటే కడుపులో ఏదో గడ్డ ఉన్నట్లుగా తేలింది.
అసలు విషయం తెలిశాక సదరు ఆస్పత్రి వైద్యులు తిరిగి శస్త్రచికిత్స చేయాలన్నారు. వారిపై నమ్మకం లేక పార్వతీపురంలోని మరో ఆస్పత్రిలో చేర్పిస్తే అక్కడి వైద్యులు ద్వారపురెడ్డి రామ్మోహన్రావు... నవ్యశ్రీకి గురువారం శస్త్రచికిత్స చేశారు.
శస్త్ర చికిత్స చేయగా కడుపులో దూది(బ్యాండేజీ) కండె ఉండటం చూసి వైద్యుడు విస్తుపోయారు. అది 6 నెలలుగా బాధితురాలి కడుపులోనే ఉండిపోవడంతో పేగులన్నీ అతుక్కుపోయి, చాలవరకూ కుళ్లిపోయాయి. దీంతో వెంటనే ఆమెకు చికిత్స చేశారు. కొద్దిరోజుల పాటు వైద్యుల సంరక్షణలోనే ఉంటేనే ఆమె తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం సాధ్యమంటున్నారు. ఆమె ఈ పరిస్థితికి రావడానికి కారణమైన సదరు ఆస్పత్రిపై బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications