నమ్మకండి: అంబటి విజ్ఞప్తి, రెండు పత్రికలపై ధ్వజం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పార్టీ వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. దీని పైన ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. తమ పార్టీ పైన అసత్య ప్రచారం జరుగుతోందని, దీనిని ప్రజలెవరు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఆయన రెండు పత్రికల పైన ధ్వజమెత్తారు. ఆ పత్రికలు అవాస్తవాలు రాసి అబాసుపాలు కావొద్దని సూచించారు.
వాస్తవాలు రాయలేకపోయినా కనీసం వాస్తవానికి దగ్గరుండేలా వార్తలు రాయాలని హితవు పలికారు. జగన్ పైన బురద చల్లడం ఇకనైనా మానుకోవాలన్నారు. తమ పార్టీ బలంగా ఉందని, ఎవరు కూడా పార్టీని వదిలి వెళ్లడం లేదని అంబటి అన్నారు. చంద్రబాబులా అద్భుతమైన అబద్దాలు ఆడే నేత ప్రపంచంలో లేరన్నారు. అధికారంలోకి వచ్చాక చేసిన ఐదు సంతకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆయన వాగ్ధానాలు నమ్మి ప్రజలు ఓటేశారని, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీకి అధికారం శాశ్వతం కాదన్నారు.
కాగా, పార్టీకి చెందిన సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ ఇప్పటికే అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఘాటైన లేఖ రాశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే ప్రచారం జరిగింది. తాజాగా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా మోడీ, చంద్రబాబులకు కితాబిచ్చారు. అయితే తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పడం కొసమెరుపు.
జాతీయ రహదారిపై మంత్రి శిద్దా రాఘవరావు

ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులను జాతీయ రహదారిగా నిర్మించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవ రావు చెప్పారు. ఇందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు.
రాజధాని నిర్మాణం నేపథ్యంలో రోడ్ల నిర్మాణం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతిలో పోలెండ్ తరహాలో ఆర్టీసీ బస్టాండ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్ల స్థలాల్లో కింద టెర్మినల్స్ పైభాగంలో థియేటర్లు, మాల్స్, రెస్టారెంట్లను నిర్మిస్తామన్నారు.
ఆర్థిక వనరుల వినియోగంపై చంద్రబాబు సమీక్ష
ఆర్థిక వనరుల వినియోగం పైన చంద్రబాబు బుధవారం హైదరాబాదులో సమీక్ష నిర్వహించారు. 26 ప్రభుత్వ శాఖల్లో ఆర్థిక వనరుల వినియోగం పైన సమీక్ష నిర్వహించారు.
పంచాయతీరాజ్ శాఖకు రూ.800 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతి ఊళ్లో రహదారి, డ్రైనేజీ, తాగునీటి పథకాలు ప్రారంభించాలన్నారు. జన్మభూమి పూర్తయ్యేలోపు ప్రతి ఊళ్లోను చెత్త నిల్వ ప్రదేశాలు గుర్తించాలని సూచించారు. రూ.150 కోట్లతో అటవీ శాఖ ద్వారా జల సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. రూ.326 కోట్లతో ఆర్డబ్ల్యుఎస్ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా పథకాలకు కేంద్రం నుండి అధిక నిధులు తెచ్చుకుందామన్నారు.












Click it and Unblock the Notifications