ఆ ఇద్దరు మహిళా అధికారులకు బాబు ప్రశంసలు.! జగన్ విమర్శల సమయంలోనే..!
ఏపీలో ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఇద్దరు మహిళా అధికారుల్ని సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రత్యేకంగా ప్రశంసించారు. దీని వెనుక ఓ కీలక కారణం ఉంది. ఓ కీలక అంశంలో ముప్పేట దాడి ఎదుర్కొంటున్న ప్రభుత్వం తరఫున వారిద్దరూ బలమైన వివరణలు ఇవ్వడమే. ఈ వివరణల తర్వాత ఈ ఇద్దరు మహిళా అధికారులు గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇద్దరు సైనిక అధికారిణులు ఇచ్చిన వివరణలు అందరికీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఆ అధికారుల్ని చంద్రబాబు ప్రశంసించగా.. అదే సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదంపై తన విమర్శల్ని కొనసాగించారు.
గతేడాది కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయుల ఎంపిక పరీక్ష డీఎస్సీలో (DSC) అక్రమాలు జరిగాయంటూ విపక్ష వైసీపీ కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. దీనిపై ప్రభుత్వం వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వివరణలు ఇస్తూనే ఉంది. అయినా వైసీపీ కొత్త కొత్త ఆరోపణల్ని తెరపైకి తెస్తోంది. అదే సమయంలో కొత్త బాధితులు కూడా తెరపైకి వస్తున్నారు. దీంతో ప్రభుత్వం తాజాగా విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియాతో పాటు శాప్ వీసీ, ఎండీగా ఉన్న భరణితో వివరణ ఇప్పించింది. గతంలో మిగతా అధికారులతో కలిసి డీఎస్సీ వివాదాలపై వివరణలు ఇచ్చిన వీరిద్దరూ .. ఈసారి మాత్రం తాము మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

దీంతో చంద్రబాబు తమీమ్ అన్సారియాతో పాటు భరణిని ప్రత్యేకంగా కలెక్టర్ల సదస్సులో ప్రశంసించారు. కొందరు వ్యక్తులు ఫేక్ ప్రచారంతో సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వేగంగా స్పందిస్తే దానికి కౌంటర్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని బాబు తెలిపారు. సరైన సమయంలో స్పందించకపోతే ఆ శిక్ష ప్రభుత్వానికి పడుతుందన్నారు. కొందరు రాజకీయాలు చేస్తూ తప్పు దోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని, డీఎస్సీ-2025లో ఎక్కడా తప్పు జరగలేదని ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారమే ఉద్యోగాలిచ్చామన్నారు. కానీ కొందరు అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారన్నారు. దీనిపై ఇద్దరు మహిళా అధికారులు చక్కగా స్పందించి కౌంటర్ ఇచ్చారని, వారిని అభినందిస్తున్నా అని చంద్రబాబు తెలిపారు.














Click it and Unblock the Notifications
