'గుర్తింపు' ట్విస్ట్: జంపింగ్స్ పైన జగన్కు ఊరట
హైదరాబాద్: ఎన్నికల సంఘం గుర్తింపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఊరట నిచ్చింది. పార్టీకి ఈసీ గుర్తింపు నేపథ్యంలో టిడిపిలోకి వెళ్దామని భావిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పునరాలోచన చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుదామని చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేవలం రిజిస్టర్డ్ పార్టీయేనని, రికగ్నైజ్డ్ పార్టీ కాదని, కాబట్టి ఆ పార్టీ నుండి టిడిపిలోకి వస్తే పార్టీ విప్ చెల్లదని టిడిపి నేతలు నిన్నటి వరకు చెప్పారు. జగన్ పార్టీ విప్ చెల్లదనే ఆలోచనతోనే ఎంపీలు, ఎమ్మెల్యేలు టిడిపి వైపు చూశారని అంటున్నారు.
అనూహ్యంగా, సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఈసి గుర్తింపు లభించింది. దీని ఎఫెక్ట్ అప్పుడే కనిపించిందని అంటున్నారు. టిడిపి అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతానని ప్రకటించిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. మంగళవారం ట్విస్ట్ ఇచ్చారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. ఎస్పీవై రెడ్డి కూడా తిరిగి జగన్ వైపు వస్తారని భావిస్తున్నారు. పార్టీకి ఈసి గుర్తింపు రావడం ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు గోడ దూకే అవకాశం ఉండదని, దూకుదామనుకున్నా వారిపై వేటుకు తాము డిమాండ్ చేస్తామని జగన్ పార్టీ చెబుతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి పలువురు తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్న టిడిపికి ఇది అసంతృప్తి కలిగించేదే అని చెప్పవచ్చు. తమ పార్టీకి గుర్తింపు వస్తుందని, టిడిపిలోకి వెళ్తే విప్ వర్తిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు నిన్నటి వరకు చెప్పారు. వారు అనుకున్నట్లుగానే గుర్తింపు వచ్చింది. దీంతో గోడ దూకే వారికి అడ్డుకట్ట పడింది.
కాగా, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక మంగళవారం స్పష్టం చేశారు. రాజకీయానుభవం లేకనే తాను అయోమయానికి గురైనట్లు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసినట్లు తెలిపారు. తాను తేరుకునే లోపలే అంతా జరిగిపోయిందని అన్నారు. పార్టీ మారడంపై తన మీద ఏ విధమైన ఒత్తిడి లేదని రేణుక చెప్పారు.