ఆర్థిక గణాంకాలు: ఏపి విభజనకు ముందు, తర్వాత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 2న రెండు రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక గణాంకాలను ఒక్కసారి పరిశీలించినట్లయితే.. దేశంలో నాల్గవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. స్థూల సంపూర్ణ దేశీయోత్పత్తి సంపూర్ణ పరిమాణంలో మూడో స్థానంలో ఉంది. దేశంలో తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉంది.
2012-13లో ప్రస్తుత ధరల వద్ద స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి రూ. 7,38, 497 కోట్లుగా ఉంది. తలసరి ఆదాయం రూ. 77,277గా ఉంది. 11వ పంచవర్ష ప్రణాళిక(2007-12) స్థిర ధరల వద్ద ఏపి వార్షిక వృద్ధి రేటు 8.18 శాతంగా ఉండగా దేశీయ జిడిపి వృద్ధిరేటు 8.02గా ఉంది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి స్థిరంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. 1980-81లో సాధించిన వృద్ధి పోకడలను మించిపోయింది. వార్షిక సగటు వృద్ధి రేటు 1980 వరకు 3శాతంగా ఉండగా, అది 2002-07 వచ్చే నాటికి 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 8.2శాతానికి పెరిగింది.
జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన నేపథ్యంలో ఈ గణాంకాలు పూర్తిగా మారననున్నాయి. ఇప్పుడు దేశంలో తెలంగాణ రాష్ట్రం అబ్సల్యూట్ జిడిపిలో, తలసరి ఆదాయంలో 13వ స్థానంలో ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(సీమాంధ్ర) కూడా జిడిపిలో 13 స్థానంలోనే ఉంది. జిడిపి తలసరి ఆదాయంలో మాత్రం 10వ స్థానంలో ఉంది.
ప్రస్తుత తెలంగాణకు ఆర్థిక నగరమైన హైదరాబాద్ ప్రధాన ఆదాయ వనరుగా మారనుంది. 2012-13లో రాష్ట్ర రెవెన్యూ పన్ను రూ. 51,441 కాగా, అందులో రూ. 11,730 కోట్లు హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం. హైదరాబాద్ మినహా తెలంగాణ నుంచి రూ. 17,577 కోట్లు, సీమాంధ్ర నుంచి 22,134 కోట్లు వచ్చాయి.
రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి), ఐటి ఆధారిత సేవలలో 99శాతం ఒక్క హైదరాబాద్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలోని 72 నోటిఫైడ్ ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)లో.. 37 సెజ్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 44శాతం ఉత్పాదక రంగం, 39శాతం నిర్మాణరంగ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాలు మినహాయించి తెలంగాణలోని ఏ ప్రాంతంలోనూ నిర్మాణరంగ కార్యకలాపాలు అంతగా కొనసాగడం లేదు. మిగితా ప్రాంతాల్లో ముఖ్యంగా మైనింగ్, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ, పామింగ్ రంగాలు వృద్ధి చెందుతున్నాయి. సింగరేణి కాలరీస్ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది.
అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ప్రపంచ స్థాయి విద్యా వసతులు, సైంటిఫిక్ ఇనిస్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటితోపాటు ప్రస్తుతం రూ. 16,500 కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అన్ని రకాల వాతావరణ అనుకూలతలతోపాటు మౌలిక సదుపాయాలు ఉన్న హైదరాబాద్ అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే హైదరాబాద్ తోపాటు ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. విద్యుత్ సమస్యను అధిగమిస్తే పారిశ్రామికంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
కాగా, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)కు కృష్ణపట్నం, కాకినాడ, విశాఖపట్నం లాంటి ప్రముఖమైన ఓడరేవులు ఉన్నాయి. సీమాంధ్రలో నాలుగు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. అవి తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలలో ఉన్నాయి. చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ చిత్తూరు గుండా పోతోంది. ఈ జిల్లాలో శ్రీ సిటీ, అతిపెద్ద సెజ్ ఉన్నాయి. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలంగా ఉంది. నెల్లూరు జిల్లా భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారనుంది. ఈ జిల్లాలో పలు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పెట్రోలియం, కెమికల్, పెట్రో కెమికల్స్ పెట్టుబడులను ఆకర్షించే ప్రాంతాలుగా విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. విశాఖపట్నంలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉండగా.. ఫార్మా రంగం కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. కృష్ణా, గోదావరి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా మంచి తాగు, సాగు నీటి వసతులను కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతానికి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా(భారత ఆహారపు గిన్నె)గా కూడా పేరుంది. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.