20 ఏళ్ల కనిష్టానికి ఏపీ టెన్త్ విద్యార్ధుల ఉత్తీర్ణత -విద్యాపథకాల వైఫల్యమా ? కోవిడ్ దెబ్బా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. అలాగే అమ్మఒడి, విద్యాదీవెన వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. స్కూళ్ల రూపురేఖలు మార్చే పేరుతో కోట్లు ఖర్చుపెడుతోంది. అయినా ఇవేవీ పదో తరగతి విద్యార్ధుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచలేకపోయాయి. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం 20 ఏళ్ల కనిష్టానికి చేరుకుని 67.26గా నమోదైంది. దీని వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.
టెన్త్ పాస్ శాతం 67.26
కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యార్ధుల్ని పదో తరగతి పరీక్షలు పెట్టకుండానే పాస్ చేస్తూ వస్తున్న ప్రభుత్వానికి ఈసారి మాత్రం పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ఉత్తీర్ణతలు సవాల్ గా మారాయి. ఇందులో పరీక్షల నిర్వహణ విషయంలో లీకులు, మాస్ కాపీయింగ్ తో ప్రభుత్వం అభాసుపాలు కాగా.. ఫలితాల వెల్లడి మాత్రం నెలరోజుల్లోపే పూర్తి చేసింది. ఉత్తీర్ణత విషయానికి వచ్చేసరికి 20 ఏళ్ల కనిష్టానికి చేరుకుని 67.26 శాతంగా నమోదైంది. ఏకంగా 71 స్కూళ్లలో జీరో ఉత్తీర్ణతా శాతం నమోదైంది. మొత్తంగా 2 లక్షలకు పైగా విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు.
కారణాలు చెప్పిన బొత్స
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం 20 ఏళ్ల కనిష్టానికి చేరడంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న కారణాలు వెల్లడించారు. కోవిడ్ కారణంగా విద్యార్ధులు అంతకు ముందు రెండేళ్లు ఇళ్లకు పరిమితం కావడం వల్లే ఈసారి ఫలితాలపై తీవ్ర ప్రభావం వడిందని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రెండేళ్లు కోవిడ్ కారణంగా 8, 9 తరగతుల్లో స్కూల్ కు దూరమైన విద్యార్ధులు ఒక్కసారిగా 10వ తరగతి స్టాండర్డ్ ను అందుకోలేకపోయినట్లు విద్యామంత్రి వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది.
విద్యాపథకాలు పనిచేయలేదా ?
ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న విద్యార్ధులకు ప్రభుత్వం అమ్మఒడి, విద్యాదీవెన, మధ్యాహ్న భోజనం పథకాలు అమలు చేస్తోంది. వీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతోంది. వీటికి డబ్బులు లేకపోయినా అప్పులు తీసుకొచ్చి మరీ అమలు చేస్తోంది. అయినా పదో తరగతి విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం పెరగాల్సింది పోయి దారుణంగా పడిపోయింది. దీంతో ఈ పథకాల అమల్లో లోపాలు ఉన్నాయా ? లేక పథకాల ప్రయోజనం విద్యార్ధులకు ఉపయోగపడటం లేదా అన్న చర్చ మొదలైంది.
సర్కార్ నిర్లక్షమెంత ?
కోవిడ్ కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు అంతకు ముందు రెండేళ్ల పాటు స్కూళ్లకు దూరమయ్యారు. దీంతో వీరు 8, 9 తరగతుల్ని సరిగ్గా చదివేందుకు వీలు కాలేదు. అటువంటప్పుడు ప్రభుత్వం పదో తరగతి విద్యార్ధులకు ముందుగానే ఓరియంటేషన్, బ్రిడ్జి క్లాసులు వంటి వాటిని నిర్వహించడం ద్వారా ఉత్తీర్ణత శాతం పెంచే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఆ విషయంలో సరిగ్గా స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవిడ్ ప్రభావం తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్ధుల్ని సాధారణ విద్యార్ధుల్లాగే పరిగణించి విద్యాబోధన చేయడంతో ఫలితాలపై ఆ ప్రభావం తీవ్రంగా పడిందని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ లోపాల్ని సవరించుకుంటే వచ్చే ఏడాది ఫలితాలైనా మెరుగుపడే అవకాశముంది.