ఏపిలో రీపోలింగ్ ఎప్పుడు : నివేదిక పంపినా రాని నిర్ణయం : ఏం జరుగుతోంది..!
ఏపిలో పోలింగ్ ముగిసి వారం పూర్తయింది. ఎక్కడ రీ పోలింగ్ అవసరమనే దాని పై జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సైతం రీ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసారు. అయితే, ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దీని పైన నిర్ణయం ప్రకటించలేదు. ఏపిలో ఇప్పుడు అధికార పార్టీ ఎన్నికల సంఘం పై పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో ఎన్నికల సంఘం రీ పోలింగ్ పైన నిర్ణయం తీసుకోకపోవటం పైనా చర్చ సాగుతోంది....
అయిదు చోట్ల రీపోలింగ్ కు సిఫార్సు..
ఏపిలో ఈనెల 11న పోలింగ్ జరిగింది. అనేక చోట్ల ఈవియంల సమస్యల పై టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. పలు చోట్ల అడ్జార్న్ పోల్ పెట్టాలని కోరుతోంది. అదే సమయంలో అయిదు ప్రాంతాల్లో రీ పోలింగ్ అవసరమంటూ జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి నివేదించారు. ఆయన సైతం ఆ నివేదకలతో పాటుగా అయిదు ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్కు అభ్యర్దించారు. ఈ మేరకు ఈ నెల16న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు.

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గం 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమలోని నల్లచెరువు 244వ కేంద్రం, నెల్లూరు జిల్లా పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ కేంద్రం, సూళ్లూరు పేటలోని అటకానితిప్ప 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కలనూతల 247వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంది.
అనుమతి కోసం నిరీక్షణ..
ఈ నెల 11న ఏపిలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అయిదు ప్రాంతాల్లో రీ పోలింగ్ జరపాలని సీఈఓ ప్రతిపాదించారు. కానీ, ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఈనెల 18న దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రక్రియ సైతం పూర్తయింది. ఈ నెల 23న మరో విడత పోలింగ్ జరగనుంది. అయితే, ఇప్పుడు ఎన్నికల సంఘం రీ పోలింగ్ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తుందనే దానిపైనా చర్చ సాగుతోంది. ఏపిలో అధికార పార్టీ ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా..తప్పు బడుతోంది. ఇక రకంగా ఎన్నికల సంఘం పైన టిడిపి అప్రకటిత యుద్దం చేస్తోంది.

మరో వైపు కోడ్ ఉండగానే ముఖ్యమంత్రి అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీని పైన నేరుగా ముఖ్యమంత్రికి కాకుండా..సీఈవో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపారు. ఇటువంటి పరిస్థితుల్లో రీ పోలింగ్ జరపటానికి ఎన్నికల సంఘం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ఇప్పటికే సాధారణ పోలింగ్ పూర్తయి పది రోజులు కావస్తోంది. త్వరగా రీ పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని పోటీలో ఉన్న సంబంధిత అభ్యర్దులు విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications