పవన్పై ఇప్పుడే కాదు, బాబుతోనే ఉంటా: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీని వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తమేనని, అయితే పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి ధైర్యం చెప్పారని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రత్యేక కమిటీపై చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు, దేశానికి నరేంద్ర మోడీ అవసరం ఉందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై తర్వాత స్పందిస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం లోపు తెలుగుదేశం తెలంగాణ కమిటీని వేసే అవకాశం ఉందని, కమిటీ ఏర్పాటు ఎలా జరిగినా తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన పార్టీని వీడుతారని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెసు పార్టీవైపు చూస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.