చంద్రబాబు అధికారంలోకి వచ్చినా నాలుగు నెలలే ! మంత్రి ధర్మాన కామెంట్స్...
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో విపక్షంపై అధికార వైసీపీ నేతలు, మంత్రులు సెటైర్లు పెరిగాయి. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనను పొగిడే క్రమంలో ప్రస్తుతం అందిస్తున్న పథకాలు, అమలు చేస్తున్న విధానాలు మరే ఇతర పార్టీ కూడా చేయడం ఎంతో కాలం సాధ్యం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు. అదే సమయంలో రేపు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా నాలుగు నెలలకు మించి ప్రభుత్వాన్ని నడపలేరంటూ ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో వైసీపీ ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ పద్ధతి అలవాటు చేసిన తర్వాత చంద్రబాబు లాంటోడు అధికారంలోకి వచ్చినా నాలుగు మాసాలు అమలు చేయడం కష్టమన్నారు.

ప్రజాస్వామ్యం అనేది రక్తం మరిగిన పులి లాంటిదని, అందులో మంచి సంప్రదాయాలు నెలకొల్పిన తర్వాత ప్రజలు వాటిని వదిలిపెట్టబోరని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. అదే వ్యక్తి, అదే నాయకత్వం కావాలని కోరుకుంటారన్నారు. పొరబాటున వారిని ఎవరైనా తప్పుదోవ పట్టించి వేరొకరిని ఎన్నుకున్నా మళ్లీ నాలుగు నెలల్లో జగన్ ప్రభుత్వమే తిరిగి వచ్చేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డే కాదు ఈ లైన్ లో తీసుకెళ్లినా ఎవరికైనా ఇదే వర్తిస్తుందన్నారు.
రాష్ట్రాన్ని రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారి వేధించిందని, మనతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలనూ ఇలాగే ఇబ్బంది పెట్టిందని ధర్మాన తెలిపారు. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం ఎలా దాన్ని ఎదుర్కొందో చూడాలని ప్రజలను ఆయన కోరారు. దీన్ని బట్టి ప్రభుత్వ పనితీరు అర్ధమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications