తెలుగుదేశం పార్టీకి చేటు తెస్తున్న మాజీ మంత్రి... చంద్రబాబుపై తమ్ముళ్ల ఒత్తిడి!
తెలుగుదేశం పార్టీ విజయవాడ రాజకీయం కొన్నిరోజుల నుంచి రసకందాయంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎంపీ కేశినేని నాని సోదరుడు చిన్నిని పార్టీలోని కొందరు నేతలే ప్రోత్సహిస్తున్నారనేది కేశినేని ప్రధాన ఆరోపణగా ఉంది. అలా చేస్తే తాను టీడీపీకి వ్యతిరేకంగా ఉండేవారందరినీ ప్రోత్సహిస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అయితే విజయవాడ రాజకీయాలు ఇలా వేడెక్కడానికి కారణం తెలుగుదేశం పార్టీలోని మాజీ మంత్రి అని, ఆయన తలదూర్చడంవల్లే ఇన్ని మలుపులు తిరుగుతోందని పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

విజయవాడ రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాతే..
గత ఎన్నికల్లో సదరు మాజీ మంత్రి ఓటమి పాలయ్యారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయనేనని తెలుగు తమ్ముళ్ల ప్రధాన ఆరోపణ. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఒంటెత్తు పోకడలు పోవడం, కీలకమైనవారిని పక్కన పెట్టడంతో పలువురు నాయకులకు, చంద్రబాబుకు దూరం పెరగడానికి ఆయనే కారణమయ్యారని విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం, ఆ మంత్రికే ప్రాధాన్యం ఇవ్వడంతో ఎన్నికల సమయానికి అది పెద్ద అవరోధంగా మారి చివరకు జిల్లాలో ఘోరంగా ఓటమిపాలవడంతోపాటు ఆయన కూడా ఓటమి పాలయ్యారనేది ప్రధాన ఆరోపణ.

ఆధిపత్య పోరుతో పార్టీకి చేటు
టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి అధినేత ఒకవైపు కష్టపడుతుంటే వీరుమాత్రం తమ ఆధిపత్య పోరులో భాగంగా పార్టీని అధఃపాతాళానికి తొక్కేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. కేశినేని సోదరుల మధ్య వివాదం చాలా చిన్నదని, ఈ మంత్రితోపాటు మరో ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఎంటరైన తర్వాతే అది చిలికి చిలికి గాలివానలా మారిందని, ఎంపీ అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించిన నాని తర్వాత ఎన్నికల్లోపోటీచేయనని ప్రకటించేదాకా వీరు తీసుకువచ్చారని, ఆయన తమ్ముడిని ప్రోత్సహించడంద్వారా పార్టీకి మేలు చేస్తున్నారో? చేటు చేస్తున్నారో అర్థం కావడంలేదని వాపోతున్నారు

అధినేత ఆలోచనలకు దూరంగా..
కేశినేని నాని రెండోసారి ఎంపీగా విజయం సాధించినప్పటినుంచి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకన్నా సొంత పార్టీ నేతలపైనే ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిందిపోయి అధినేత ఆలోచనలను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినరీతిలో వ్యవహరిస్తున్న వీరికి చెక్ పెట్టాలంటే చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాలని, వివాదానికి ముగింపు పలకాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. వివాదానికి ఇప్పుడు ముగింపు పలకకపోతే గత ఎన్నికల్లానే ఈసారి ఎన్నికల్లో కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని, ఇటువంటి విషయాలపై సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications