చిచ్చుపెట్టడానికి రాలేదు: శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్, ‘జనసేనలోకి చదలవాడ’
Recommended Video

శ్రీకాకుళం: ఇటీవల టిట్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా జాతీయ రహదారిపై ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో పవన్ మాట్లాడారు.

చిచ్చు పెట్టడానికి కాదు..
తాము కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదని పవన్ కళ్యాణ్ స్పృష్టంచేశారు. టిట్లీ తుపాను ధాటికి ఉద్దానం ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని చెప్పారు. సామాన్యంగా పండుగలు కుటుంబాలతో జరుపుకొంటామని.. మీరే నా కుటుంబమని, అందుకే మీ దగ్గరకు వచ్చానని బాధితులతో పవన్ అన్నారు.

ప్రజలకు అండగా ఉండేందుకే..
ఈ సందర్బంగా పవన్.. చంద్రబాబు సర్కారుపై తీరుపై మండిపడ్డారు. యువత భృతిని కోరడంలేదని, తమ జీవితం తాము నిర్మించుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారన్నారు. నిరాశా నిస్పృహల్లో నుంచి పుట్టిందే జనసేన అని ఆయన పేర్కొన్నారు. యువతలో ఎంతో ఆవేదన ఉందన్నారు. తాను రాజకీయం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు అండగా ఉండేందుకే వచ్చానన్నారు.

తుఫానుతో నాశనమైందంటూ..
కోనసీమ లాంటి ఉద్దానం తుఫానుతో నాశనమైందని.. 25 సంవత్సరాలు వెనక్కి పోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వం కోల్పోయిన రైతులను పెత్తందారులు భూములు అడుగుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారంతా ఎక్కడికి పోతారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తాను రాలేదని, బాధితులకు అందుతున్న సహాయం పర్యవేక్షించేందుకు సామాన్యుడిగా వచ్చినట్లు పేర్కొన్నారు.

సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు..
కేరళలో తుఫాను బాధితులకు కోట్ల రూపాయల సహాయం అందించారని, వెనుకబడిన ప్రాంతం ఉద్దానానికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. జిల్లాలో జరిగిన విపత్తు వల్ల వలసలు పెరిగే అవకాశం ఉందని, జిల్లావాసులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

యుద్ధం ఆగదు
ప్రజల కన్నీళ్లు, కష్టాలు ప్రభుత్వానికి అర్థం కావాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పవన్ చెప్పారు. యువతకు 25 సంవత్సరాల భవిష్యత్తు నిర్మించేందుకు జనసేన పోరాటం చేస్తుందని వ్యాఖ్యానించారు. కురుక్షేత్రం లాగా ధర్మం గెలిచేవరకు తన యుద్ధం ఆగదని పవన్ కళ్యాణ్ అన్నారు. 2019 ఎన్నికల్లో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు. తుఫాను బాధితులకు టీడీపీ సాయం చేయకపోతే జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంపూర్ణ న్యాయం చేస్తుందని అన్నారు.

జనసేనలోకి చదలవాడ కృష్ణమూర్తి
కాగా, టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు పిళ్లా శ్రీనివాస్తో పాటు మరికొందరు జనసేనపార్టీలో చేరారు. చదలవాడ లాంటి నాయకులు జనసేనలోకి రావడం పార్టీకి మరింత బలాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సమాజ హితం కోరుకునేవారిని పార్టీ ఆహ్వానిస్తోందని అన్నారు. అంతకు ముందు మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్తో కలిసి దుర్గాదేవికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications