పోలవరంపై తేల్చేసిన కమిటీ - చంద్రబాబు సమర్ధతకు పరీక్ష..!!
పోలవరం ప్రాజెక్టు పై నిపుణుల కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత అమరావతి..పోలవరం తమ ప్రాధాన్యత అంశాలుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ వివాదం ప్రాజెక్టు కొనసాగింపుకు ఇబ్బందిగా మారింది. దీంతో, ఈ వ్యవహారంలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ ప్రాజెక్టు పరిశీలించి..నివేదిక ఇచ్చింది. కీలక సూచనలు చేసింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది.
కమిటీ నివేదిక
పోలవరం పాత డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులు చేసుకునే అవకాశముందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పేర్కొంది. అదే సమయంలో మరో కీలక సూచన చేసింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు భద్రతరీత్యా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించుకోవచ్చునని కూడా పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర జలసంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుంది. పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి 53 పేజీల నివేదికను పంపారు.

కార్యచరణ
పోలవరం సాగునీటి ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్యలో వీలైనంత త్వరగా ప్రస్తుత డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్వాల్ను నిర్మించుకోవచ్చని నివేదికలో స్పస్టం చేసారు. ఈ ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జూలై 31 దాకా నిరంతరాయంగా డయాఫ్రమ్వాల్ పనులు చేపట్టేలా కార్యాచరణను అమలు చేయాలి. ప్రాజెక్టులో చేపట్టాల్సిన మిగిలిన పనులన్నింటిపైనా ఇన్వెస్టిగేషన్, డిజైన్ల రూపకల్పన కొనసాగించుకోవచ్చుని నిపుణుల బృందం సిఫారసు చేసింది.
కీలక సూచనలు
అయితే... మెయిన్ డ్యామ్ పనులకు సంబంధించి డిజైన్లు, నిర్మాణ పనులపై వర్క్షాపును నిర్వహించాలని సూచించింది. నిర్మాణ యాజమాన్య విధానంలో భాగంగా క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని తెలిపింది. పాత డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులు చేసే అవకాశమున్నప్పటికీ... కేంద్ర జల సంఘం ఆలోచనల మేరకు కొత్త డయాఫ్రమ్వాల్ను నిర్మించుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుత డయాఫ్రమ్వాల్ నిర్మాణంలో వినియోగించిన మెథడాలజీనే కొత్త డయాఫ్రమ్వాల్ నిర్మాణానికి ఉపయోగించాలని సూచించింది. షెడ్యూల్లోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు వీలుగా వనరులను సిద్ధం చేయాలని పేర్కొంది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం అథారిటీతో చర్చించనున్నారు. ఆ తరువాత ప్రాజెక్టు పైన తీసుకొనే నిర్ణయం పైన స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications