సభలో జెండాలు, టవల్స్ విసిరిన అభిమానులు, పవన్ కంటికి మళ్లీ గాయం
దెందులూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి గాయమైంది. నిన్న దెందులూరు సభలో పలువురు అభిమానులు, కార్యకర్తలు జెండాలు, టవల్స్ విసిరారు. ఇవి తగిలి అతని ఎడమ కంటికి గాయమైంది. దీంతో వైద్యులు గురువారం ఉదయం పవన్ కంటిని పరీక్షించారు.
అంతకుముందు రోజు, దెందులూరు సభలో పవన్.. చింతమనేనిపై తీవ్ర విమర్శలే గుప్పించారు. ఆకురౌడీ, వీధి రౌడీ అన్నారు. అంతేకాదు, నూనుగు మీసాల యువకుడిని చింతమనేనిపై పోటీకి పెడతానని చెప్పారు. దానికి చింతమనేని కూడా గురువారం ఘాటుగా స్పందించారు. పవన్కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలన్నారు.

స్టింగ్ ఆపరేషన్ పైన కూడా విమర్శలు గుప్పించారు పవన్. తాము ఇన్విటేషన్ ఇచ్చిన కార్యక్రమాన్ని స్టింగ్ ఆపరేషన్ అంటున్నారని, ఎవరో ఎవరి వద్దో పడుకుంటే పవన్ కళ్యాణ్ స్పందించాలట అని ఇతర అంశాలపై ఘాటుగానే స్పందించారు.
మన చట్టాలు బలమైన వారికి చాలా బలహీనంగా, బలహీనులకు చాలా బలంగా కనిపిస్తున్నాయని పవన్ అన్నారు. ఎమ్మెల్యేలు ఇన్ని తప్పులు చేస్తున్నా సీఎం, డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆడపడుచులకు రక్షణ కల్పిస్తామని చంద్రబాబు చెబుతారని, ఇక్కడేమో ఎమ్మెల్యేలు మహిళలను తిడతారని, సీఎంకు ఈ ఎమ్మెల్యే అంటే భయమా అని చింతమనేనిని ఉద్దేశించి అన్నారు.
తాను రెచ్చగొడితే జనం అగ్నిగుండం సృష్టిస్తారని, సామాన్యులపై ఆగడాలు చేస్తే ఊరుకోమని, తిరగబడతామని హెచ్చరించారు. పోలీసుల వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications