నకిలీ కరెన్సీ నోట్ల పంపిణీ ముఠా గుట్టు రట్టు
విజయవాడ: నకిలీ నోట్లు చెలామణి చేసే ఏడుగురు ముఠా సభ్యులను మంగళవారం అరెస్టు చేసి వారి వద్ద నుండి 17 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను, కారు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు స్టేషన్ ఎస్హెచ్ఒ (ఇన్స్పెక్టర్) భాస్కరరావు తెలిపారు.
కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ నోట్లకు సంబంధించిన వివరాలు అందించారు.
అశ్వరావుపేట, కల్లూరు, జీడిమెట్ల ప్రాంతాలకు చెందిన ముఠా సభ్యులు ఈ నెల 6న మండలంలోని దాములూరుకు చెందిన జి వీరయ్యకు లక్షకు 3 లక్షలు నకిలీ నోట్లు ఇస్తామని చెప్పారని, దీనిపై వీరయ్య తమకు సమాచారం ఇవ్వగా ముఠా సభ్యులను పట్టుకున్నామని ఆయన చెప్పారు.
పల్లగిరి వద్ద పోలీసులు కాపు కాసి నిందితులు పోకల కోటేశ్వరరావు, నీలం లక్ష్మణరావు, పూజల శ్రీను, పి గోవర్థన్, ఆర్ నర్సింహం, కె. లక్ష్మణరావు, ముక్కాముల శ్రీరామమూర్తిలను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిపై గతంలో పశ్చిమ గోదావరి, విజయవాడ, ఖమ్మం జిల్లాలో కేసులు ఉన్నట్లు తెలిపారు.