చదివింది ఎనిమిదే: కానీ సర్వ రోగాలను పోగొట్టే డాక్టర్?.. నకిలీకి పోలీసుల చెక్
నకిలీ డాక్టర్ అవతారమెత్తి లక్కీ క్లినిక్ పేరుతో రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నాడు.
హైదరాబాద్: చదివింది ఎనిమిదో తరగతి.. కానీ సకల రోగాలకు వైద్యం చేయగలనని చెబుతూ డాక్టర్ అవతారం ఎత్తాడు. అతను చేసేది వైద్యం కాదు మోసమని తెలుసుకోని ఎంతోమంది వేల కొద్ది డబ్బులు పోగొట్టుకున్నారు.
మోసం ఎన్నో రోజులు దాగదు కదా. విషయం పోలీసులకు తెలియడంతో అతని క్లినిక్ మీద దాడి చేసి మోసాన్ని బయటపెట్టారు. వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆధ్వర్యంలో జరిపిన తనిఖీల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

ఎవరీ డాక్టర్:
పశ్చిమబెంగాల్కు చెందిన అజయ్కుమార్(25) ఎనిమిదో తరగతి చదివాడు. 2006లో సూర్యాపేటలో ఉన్న బంధువు ఇంటికి వచ్చాడు. అతని వద్దే ఆర్ఎంపీగా పనిచేస్తూ కొన్నిరోజులు అక్కడే ఉన్నాడు. అక్కడ పనిచేసిన అనుభవంతోనే సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలనే ఆలోచనకు వచ్చాడు.

లక్కీ క్లినిక్:
సూర్యాపేట నుంచి హైదరాబాద్ చేరుకున్న అజయ్.. స్థానికంగా లక్కీ క్లినిక్ పేరిట ఆసుపత్రి ప్రారంభించాడు. అన్ని వ్యాధులకు చికిత్స అంటూ తనకు తోచిన మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇస్తున్నాడు. ఫైల్స్కు ప్రత్యేక చికిత్స అంటూ ఆ సమస్యతో బాధపడే ఒక్కో రోగి నుంచి రూ.15,000-20,000 వరకూ వసూలు చేస్తూ వస్తున్నాడు.

ఎట్టకేలకు దొరికాడు:
నకిలీ వైద్యుడి విషయం తెలుసుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అతడి క్లినిక్లో తనిఖీలు నిర్వహించారు. కనీస విద్యార్హత, ఎలాంటి అనుమతులు లేకుండానే అజయ్ కుమార్ వైద్యం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

వైద్య పరికరాలు స్వాధీనం:
నిందితుడు అజయ్ ని అరెస్టు చేసినట్లు అడిషనల్ డీసీపీ శశిధర్రాజు తెలిపారు. క్లినిక్ నుంచి వైద్య పరికరాలు, ఆయుర్వేద మందులు, ఇంజెక్షన్స్, సెల్ఫోన్,రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అజయ్కుమార్ను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications