రాజధాని భూసేకరణ: ఎదురు తిరిగిన రైతులు
గుంటూరు: రాజధానికి భూసమీకరణలో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న మంత్రివర్గ ఉపసంఘానికి మరో గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో సోమవారం నిర్వహించిన ల్యాండ్ పూలింగ్ అవగాహన సదస్సు రసాభాసగా మారింది. ఏకపక్షంగా భూసమీకరణకు అంగీకరించేది లేదని, గోబ్యాక్ అంటూ రైతులు నినాదాలు చేయడంతో కమిటీ సభ్యులు ఏమీ చేయలేక వెనుదిరిగారు. ఇంతకు ముందు తుళ్లూరు మండలం రాయపూడి గ్రామ రైతులు కూడా భూములు ఇవ్వడానికి ససేమిరా అన్న విషయం తెలిసిందే.
గ్రామస్థులను శాంతింపజేసి సదస్సును కొనసాగించేందుకు స్థానిక నాయకులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని కమిటీకి స్పష్టం చేసిన రైతులు సదస్సును బహిష్కరించి వెళ్లిపోవడంతో అభిప్రాయ సేకరణ పూర్తి చేయకుండానే కమిటీ సభ్యులు వెళ్లిపోవాల్సి వచ్చింది. మండల పరిధిలోని నెక్కల్లు, అనంతవరం, వెంకటపాలెం గ్రామాల్లో కూడా ఆదివారం రైతు సదస్సులు జరిగాయి.

నెక్కల్లు, అనంతవరం గ్రామరైతులు భూ సమీకరణకు పూర్తి సహకారాన్ని అందజేస్తామని చెప్పారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లో భూములిచ్చేది లేదని వెంకటపాలెం గ్రామరైతులు రైతు సదస్సులో నినాదాలు చేశారు. వెంకటాయపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన రైతు సదస్సుకు సబ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులైన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భూములిచ్చిన రైతులకు ఇచ్చే పొలాలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు.
ప్రభుత్వ విధివిధానాల గురించి వివరిస్తుండగా ఈశ్వరమ్మ అనే మహిళ కేకలు వేస్తూ ప్రసంగాన్ని అడ్డుకుంది. తెలుగుదేశం పార్టీని గెలిపించి తమ కొంపముంచుకున్నామని ఆమె ఆక్రోశించింది. స్థానిక నాయకులు జోక్యం చేసుకుని శాంతంగా వినాలని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామరైతులు ఒక్కసారిగా ధ్వజమెత్తుతూ శాంతంగా వింటూ కూర్చుంటే భూసమీకరణకు అనుకూలమని రాసుకుంటారా అని ప్రశ్నించారు. భూములు ఇచ్చేది లేదని, సబ్ కమిటీ గోబ్యాక్ అంటూ గందరగోళం సృష్టించారు.
కమిటీ సభ్యులు మళ్లీ అభిప్రాయ సేకరణ చేయబోతుండగా రైతులందరూ ఒక్కసారిగా లేచి సదస్సు నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో అభిప్రాయ సేకరణ చేయకుండానే సబ్ కమిటీ వెనుదిరగాల్సి వచ్చింది. ఇదిలావుంటే, ల్యాండ్ పూలింగ్ కోసం ప్రకటించిన తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాల నుంచి ఒక్కో గ్రామానికి ఐదుగురు రైతుల చొప్పున రైతు నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్లతో సమావేశం కానున్నారు. రైతులు తమ సాదకబాధకాలను నేరుగా ఆయనకే చెప్పుకునేలా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications