ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో లేనట్లే !...స్ధానిక పోరు వాయిదాతో మారుతున్న సమీకరణాలు..
పార్టీ కోసం తొమ్మిదేళ్లు కష్టపడ్డారు. అధికారం కోసం అన్నీ వదులుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అయినా ప్రభుత్వ పెద్దలు కరుణిస్తారేమోనని పది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వారి ఆశలు స్ధానిక పోరుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సర్కారుకు ఏమాత్రం పట్టడం లేదు. పైగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడి ఇబ్బందుల్లో ఉంటే మీగోల ఏంటని వారిని చీదరించుకునే పరిస్ధితి. దీంతో ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న వైసీపీ నేతల్లో నిరాశ తప్పడం లేదు.
అధికారం లేకపోయినా పార్టీ కోసం..
2010లో వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి తగినంత క్యాడర్ లేదు, జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ, మరికొందరు మాత్రమే పదవుల్లో ఉన్నారు. ఉమ్మడి ఏపీలో పార్టీ బలోపేతం కావాలంటే చాలా కష్టాలు తప్పవు. కోట్ల రూపాయల డబ్బు ఖర్చుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాత్రీ పగలూ శ్రమించక తప్పని పరిస్దితి. అయినా భవిష్యత్తు బావుంటుందో లేదో అన్న అనుమానాలే. అయినా వారు కష్టపడ్డారు. తొమ్మిదేళ్ల పాటు అధికార కాంగ్రెస్, వారితో జత కట్టిన మరో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అవమానాలను సైతం భరించారు. చివరికి 2014లో ఎన్నికలు వచ్చినా అధికారం మాత్రం అల్లంత దూరంలోనే ఉండిపోయింది. వచ్చిన 67 సీట్లను చూసుకునేలోపే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి జారిపోయారు. మిగిలిన వారిలోనూ ఎవరుంటారో, ఎవరు పోతారో తెలియని పరిస్ధితి. అయినా
2019లో అధికారం వచ్చాక..
ఎట్టకేలకు 2019లో వైసీపీ అధికారం చేపట్టడం, మంత్రిపదవులు, ఉప ముఖ్యమంత్రులు, సలహాదారులు, ఇవేవీ దక్కని వారికి కీలక కార్పోరేషన్ల పదవులు వరించడం చకచకా జరిగిపోయాయి. మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నిస్తే ఎక్కడా జవాబు దొరకని పరిస్దితులు. అడగ్గా అడగ్గా ఒక్కో నామినేటెడ్ పదవీ భర్తీ చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ... ఈ నెలలో స్ధానిక పోరు ముగిశాక ఎలాగైనా సర్దుబాటు చేస్తామని పార్టీలోని ఆశావహులకు నచ్చజెప్పింది. చివరికి అదీ జరిగే పరిస్దితి కనిపించడం లేదు.
స్ధానిక పోరు వాయిదా- సమీకరణాలు
స్ధానిక పోరు వాయిదా పడటంతో వైసీపీలో నామినేటెడ్ పదవుల కోసం పది నెలలుగా ఎదురుచూస్తున్న వారి పరిస్ధితి మరింత అగమ్యగోచరంగా మారిపోయింది. ఎన్నికల వాయిదా, తదనంతర పరిణామాలు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మంగా మారిపోవడంతో ఇప్పుడు వైసీపీ పెద్దలంతా నామినేటెడ్ వ్యవహారాన్ని పూర్తిగా మర్చిపోయారు. చివరికి ఎవరిని కదిపినా ఇప్పట్లో కాదులే అనే సమాధానమే వస్తోంది. 151 సీట్లతో అధికారంలో ఉండికూడా స్ధానిక పోరును నిర్వహించలేని పరిస్ధితుల్లో ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నప్పుడు ఇక తమ పరిస్ధితి ఏంటనేది ఇప్పుడు వైసీపీలో నామినేటెడ్ పదవుల ఆశావహుల ప్రశ్న.
Recommended Video
పార్టీకి అధికారం వచ్చింది కానీ..
వైసీపీ అధికారం చేపట్టి ఈ నెలాఖరుకు పది నెలలు పూర్తవుతోంది. అయితే పార్టీ కోసం తొమ్మిదేళ్లుగా శ్రమించిన వారికి మాత్రం అధికారం, పదవులు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. దీంతో వారిలో అసహనం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే నామినేటెడ్ ఆశావహులంతా మంత్రులు, వైసీపీ పెద్దల చుట్టూ తిరుగుతూ లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. మరికొందరు ప్రభుత్వ సలహాదారు సజ్జలతో పాటు మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ సాయిరెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. గతేడాది ఎన్నికలకు విపక్ష టీడీపీ కనీసం పార్టీ పదవులు ఆఫర్ చేసినా వాటికి వదులుకుని, నామినేటెడ్ పదవులపై ఆశతో వైసీపీలో కొనసాగుతుంటే ఈ అవమానాలేంటని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. అయినా వారికి అరణ్యరోదన తప్పడం లేదు.