మహిళలపై అత్యాచారాలకు సినిమాలూ కారణమే: సీనియర్ నటి జమున
అమరావతి: ప్రస్తుత సినిమాలు యువతపై చెడు ప్రభావం చూపుతున్నాయని సీనియర్ సినీనటీ జమున అన్నారు. ఆమె బుధవారం అమరేశ్వరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె ‘ఆంధ్రజ్యోతి'తో మాట్లాడుతూ.. పలు సామాజిక అంశాలపై స్పందించారు.
తమ కాలంలో సామాజిక అంశాలు, కుటుంబ విశేషాలు, ప్రజాసమస్యలు, రాజకీయాల్లో కుళ్లుపై ప్రజలకు అవగాహన కల్పించేలా సినిమాలు తీసేవారని గుర్తు చేశారు. నేడు మాత్రం అర్ధనగ్నంగా హీరోయిన్, వ్యంగ్య డైలాగులు ఉంటున్నాయని అన్నారు.
ప్రస్తుత సమాజంలో మహిళలపై అత్యాచారాలకు సినిమాలు కూడా కారణమవుతున్నాయని అన్నారు. మీడియా, పత్రికలలో సైతం హీరోయిన్ల అర్ధనగ్న ఫొటోలను ప్రచురించి యువతపై చెడుముద్ర పడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన స్వగ్రామం దుగ్గిరాల అని, హాంపీలో పుట్టి పెరగడంతో హాంపీ సుందరిగా పిలిచేవారని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు.
భగవద్గీతలోని అంశాలను ఆచరించడం ద్వారా మానవ జన్మ సార్ధకమవుతుందని జమున అన్నారు. కాగా, అమరేశ్వరాలయ అర్చకులు ఆమెకు తీర్ధ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. అనంతరం వైకుంఠపురంలోని భవఘ్ని ఆరామాన్ని సందర్శించారు. ఆరామానికి రావడం మనస్సుకు ప్రశాంతత కలిగించిందని తెలిపారు. ప్రస్తుత సమాజానికి భగవద్గీత ఆచరణ ఆవశ్యకత ఉందని జమున చెప్పారు.