పెదవి విప్పిన వైవీ..! ప్రత్యక్షరాజకీయాల్లోనే ఉంటానన్న సుబ్బారెడ్డి..!!
Recommended Video

హైదరాబాద్: కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పెదవి విప్పారు. టికెట్ లభించకపోవడంతో జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అలకబూనారని, కొద్దిరోజులుగా ఎవరికీ అందుబాటులో లేరని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నానని వివరణ ఇచ్చారు.
వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చానని చెప్పారు. తాను ఒంగోలు టికెట్ ఆశించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, వేరే వారికి టికెట్ కేటాయించడం పార్టీ నిర్ణయమని పేర్కొన్నారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జగన్ సీఎం కావడం అనివార్యమని వైవీ అభిప్రాయపడ్డారు. అందుకోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తనకు రాజ్యసభ టికెట్ ఇస్తానని జగన్ చెప్పిన మాట వాస్తవమే అయినా తానే తిరస్కరించానని తెలిపారు.

తనకు ప్రత్యక్ష రాజకీయాలంటేనే ఆసక్తి అని వ్యాఖ్యానించారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలని తన అభిమానులను కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. తాను ఇన్ఛార్జిగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.పార్టీ టికెట్ లభించకపోవడంతో వైవీ అలక పాన్పు ఎక్కారని వార్తలు వచ్చాయి.
తెదేపా నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తీసుకొచ్చి లోక్సభకు పోటీ చేయిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆయన పది రోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని టంగుటూరులో బుధవారం పార్టీ అధినేత జగన్ నిర్వహించిన బహిరంగ సభకు సుబ్బారెడ్డి రాకపోవడం చర్చనీయాంశమైంది. పులివెందులలో ఈనెల 15న వివేకానందరెడ్డి హత్యకు గురైన సందర్భంలోనూ ముఖ్య నాయకులు అక్కడికి వెళ్లినా వైవీ వెళ్లకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications