బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు: ముగ్గురు సజీవ దహనం
నెల్లూరు పోర్లుకట్టలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కేంద్రంలో పని చేసే కార్మికులు మంటల్లోనే చిక్కుకున్నారు.
నెల్లూరు: నెల్లూరు పోర్లుకట్టలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కేంద్రంలో పని చేసే కార్మికులు మంటల్లోనే చిక్కుకున్నారు.
బాణాసంచా తయారీ కేంద్రంలో పని చేస్తున్న ముగ్గురు కార్మికులు సజీవదహనం కాగా, మరో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పేశాయి.
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ బాణాసంచా కేంద్రానికి అనుమతి ఉందా? లేదా? అనేదానిపై విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఎవరైన సిగరేట్, బీడీ కాల్చి నిప్పుపడేయడం వల్లే ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పేలుడు కారణంగా భయంతో స్థానికులు పరుగులు తీశారు. కాగా, మంత్రి చినరాజప్ప ఘటనపై ఎస్పీకి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.